Pages

Wednesday, October 29, 2014

లలితా మహిళామండలి ఇరవైయ్యొకటవ వార్షికోత్సవ సంబరాలు..



    ఈ నెల యేడవ తారీకు మంగళవారం  మా లలితా మహిళామండలి ఇరవైయ్యొకటవ వార్షికోత్సవం చాలా బాగా జరిగింది. ఆరోజు మధ్యాహ్నం పదకొండు గంటలకల్లా మా సభ్యుల్లో ఒకరయిన రాజ్యలక్ష్మిగారింటికి మేమందరం చేరిపోయాం.
ఈవిడే రాజ్యలక్ష్మిగారు.


 
 
 
      ఆ రోజు మా విందుబాధ్యతంతా ఆవిడే తీసుకున్నారు. యెంతైనా పెద్ద మనసులెండి. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసారు.
 
ఈసారి వార్షికోత్సవాలకి మా సభ్యులం అందరం యెవరికి తోచిన ప్రజ్ఞ వాళ్ళు చూపించాలని అనుకున్నాము. ఆ సందర్భంగా
 
  అంతకు ముందే జరిగిన మహాత్మాగాంధీ పుట్టినరోజుని గుర్తు చేస్తూ దుర్గ గాంధీగారి గురించి  కొన్ని విషయాలు
 
సోదాహరణంగా ప్రస్తావించారు.
 
 


                              కమలగారు తరిగొండ వెంగమాంబ జీవితం గురించి ఆసక్తికరంగా వివరించారు.




                                  గాయత్రి పోతన భాగవతంలోని పద్యాల మాధుర్యాన్ని రుచి చూపించారు.




                                                   సీత బలే బలే జోక్స్ చెప్పి నవ్వించారు.




                           శారద తెలంగాణా మాండలికంలో వినాయకచవితి కథ చెప్పి అందరినీ ఆహ్లాదపరిచారు..




                                          రామలక్ష్మి దుర్గాష్టకం చదివి అందరిలో భక్తిభావం కలిగించారు.


    రాజ్యలక్ష్మి  కొన్ని నవీన జీవితసత్యాలను చదివి అందరి కళ్ళూ తెరిపించారు. అందులో మచ్చుకి ఒకటి రెండు చెప్పాలంటే..
పెద్ద పెద్ద ఇళ్ళు-ఒంటరి సంసారాలు
పెరిగిన డిగ్రీలు-తగ్గిన కామన్ సెన్స్
ఎక్కువ జీతం- తగ్గిన మనశ్శాంతి ... లాంటివి. బాగున్నాయి కదూ..




       కళ్యాణి కస్తూరి రంగ రంగా అంటూ చిన్నికృష్ణుని పుట్టుక గురించి యెప్పటిదో పాటని మళ్ళీ అందరికీ అందజేసారు.




   ఉమాసుందరి కోడలు దిద్దిన కాపురం సినిమాలో  "నీ ధర్మం నువు మరవొద్దూ.." అంటూ అందరినీ ప్రగతి పథులని చేసారు.



               విద్యుల్లత "ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుందీ.." అని పాడి అందరినీ శబరి భక్తిలో ముంచేసారు.



       రత్న శాంతినివాసం సినిమాలో "రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా.." పాటను మృదుమథురంగాపాడి అందరినీ సరాగాల ఉయ్యాలలో ఊపేసారు.



                          పద్మామూర్తి కీరవాణిరాగంలో "అంబ వాణి నన్నాదరింపవే.." పాడి వీణాపాణిని స్తుతించారు.


                                                             
                                                           మా మిగిలిన సభ్యులు..లక్ష్మీ ఆచార్య.

 

                                                                       సరస్వతి..




                                                                            సంధ్య

 

            సౌమ్య మా సభ్యురాలు కాకపోయినా మాలాంటి అమ్మమ్మలకోసం పరిదాన మిచ్చితే..పాడి ఆనందపరిచింది.




                          నేనూ, మా చెల్లెలు భారతీ టీవీ ప్రోగ్రాముల గురించి చిన్న వ్యంగ్య నాటిక లాంటిది చేసాము.

 
 
 చెప్పుకోడానికి ఆఖరున చెప్పుకున్నా అయస్కాంతంలా అందరినీ ఆకట్టేసుకుని, నాయకత్వం వహించేసి, మా అందరిచేతా హౌసీ ఆడించేసిన అమేయ సంతోషం చెప్పలేనిది. ఇదిగో అమేయ..
 
 
 
 
 
 ఇన్ని పాటలూ పాడేసుకుని, ఇన్ని కబుర్లూ చెప్పేసుకుని, ఇన్ని ఆటలూ ఆడేసుకుని మరి అసలు సంగతి చెప్పుకోకపోతే యెలా.. అదేనండీ.. విందు భోజనం.. ఇదిగో..
 
 
 
 
 
 
                                అన్నట్టు మీకు ఇంకా ఓపిక వుంటే నేనూ, భారతీ కలిసి చేసిన స్కిట్.. ఇదే..


 
 
                       అందరం కలిసి యెంచక్కా సరదా సరదాగా గడిపి సాయంత్రానికి ఇళ్లకి మరలాము..
 
-------------------------------------------------------------------------------------------------------------------- 
 


 

Thursday, October 16, 2014

శ్రథ్థాంజలి..



      మాన్యులు శ్రీమతి తురగా జానకీరాణిగారు నాకు గురుతుల్యులు.

    ఇరవై సంవత్సరాలక్రితం ఒక కథ వ్రాసి ఆకాశవాణి స్త్రీల కార్యక్రమానికి పంపిస్తే, అలా కథలా కాకుండా అదే విషయాన్ని ఒక నాటికలా వ్రాసి పంపమని ఆవిడ స్వయంగా ఉత్తరం వ్రాసారు. అంత పేరున్న ఆవిడ ఎంతో ఆప్యాయంగా అలాగ వ్యక్తిగతంగా నాకు ఉత్తరం వ్రాయడం నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఆవిడ అలా చెప్పడం వలన ఆకాశవాణికి నాటికలు ఎలా వ్రాయాలో నాకు తెలిసింది. ఆ నా మొట్టమొదటి నాటికను “రేపటి మహిళ” అనే పేరుతో ప్రసారం చేసారు జానకీరాణిగారు.

    అంతే కాకుండా మీ స్నేహితులంతా కలిసి ఒక మహిళామండలిగా యేర్పడండి, మీకు ఆకాశవాణిలో కార్యక్రమం చేసే అవకాశమిస్తాను అని చెప్పి, మమ్మల్ని ప్రోత్సహించి, లలితా మహిళామండలి ఆవిర్భవించడానికి కారణమయ్యారు. మా మొట్టమొదటి ప్రోగ్రామే సంక్రాంతిపండుగ ప్రత్యేక కార్యక్రమంలా చేయించి, మమ్మల్ని యెంతగానో ప్రోత్సహించారు.  ఆవిడ ఇచ్చిన స్ఫూర్తి వలన మేము అలాగ యెన్నో కార్యక్రమాలు చేసాము.

     అంతే కాకుండా యెక్కడ కనపడినా ఆప్యాయంగా పలకరించడం ఆవిడ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. నేను వ్రాసిన కథలను చదవమని ఆవిడకు యిస్తే, యెంతో ఓపికగా అవి చదవడమే కాకుండా, మా ఇంటికి ఫోన్ చేసి మరీ ప్రతి కథనూ విశ్లేషించడం నాకు ఒక వరంగానే అనిపిస్తుంది.

   అటువంటి మహా మనీషి గురించి యెంత చెప్పినా తక్కువే. వారి పిల్లలకు ఈ దుఃఖం తట్టుకునే శక్తి నివ్వాలనీ, ఆవిడ ఆత్మకు శాంతి కలగాలనీ ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను.

 

Friday, September 12, 2014

లలితా మహిళామండలి మీటింగ్..



     మొన్న పదోతారీకున బుధవారం మా లలితామహిళామండలి ప్రతినెలా జరుపుకునే మీటింగ్ జరిగింది. మామూలుగా మేము యేడాదికి రెండుసార్లు అంటే వార్షికోత్సవానికి, అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి లంచ్ కలిసి పెట్టుకుంటాము. మిగిలిన ప్రతినెలా ఒక్కొక్కసారి ఒక్కొక్క మెంబర్ ఇంట్లో సాయంత్రం నాలుగునుంచి ఏడుగంటలవరకూ మీటింగ్ పెట్టుకుని వివిధ విషయాలు చర్చిస్తుంటాము. అలాగే ఈసారి వంతు కమలగారిది వచ్చింది. ఆవిడ శ్రావణమాసంలో స్నేహితులందరినీ (అంటే మమ్మల్నేలెండి) భోజనానికి పిలుద్దామని చాలా చాలా అనుకున్నారు పాపం. కానీ మనందరికీ శ్రావణమాసం చాలా బిజీ నెలకదా.. చాలామంది రాలేకపోయారు.ఆవిడ ఈసారి భోజనానికి రావల్సిందే తప్పదని పట్టుపట్టారు.  సరేనంటూ ఈ నెల మేమందరం కలిసి ఆవిడ ముచ్చట తీర్చాం. ఇదుగో ఈవిడే కమలగారు.
 
         సరిగ్గా పదకొండున్నరకి రమ్మన్నారు. మొత్తం పదిహేనుమందిమి  చేరేసరికి పన్నెండు అవనే అయింది. ప్రోగ్రామ్ ముందే చెప్పేసారు. అదేమిటంటే భోజనానికి ముందు క్విజ్ పెడతాననీ, భోజనమయ్యాక తంబోలా ఆడదామనీ చెప్పేసారు. నిజం చెప్పొద్దూ.. నేను కొంచెం టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఈ కమలగారు టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు. క్విజ్ అంటే యేమేమి అడుగుతారో నని ముందు జాగ్రత్తగా ఆరోజు ఉదయమే ఫోన్ చేసి, ఎంతో వినయంగా..”నేనేమైనా తేనాండీ..?” అనడిగాను. అసలే టీచర్ గా చేసినావిడ ఇలాంటివెన్ని చూసుంటారో.. ఎంతో మర్యాదగా, “మీరు రండి చాలు..” అన్నారు. నా ప్రయత్నం ఫలించలేదు. క్వశ్చన్ పేపర్ కాస్త కూడా లీకవలేదు.  

    సరే.. పన్నెండుకల్లా అంతా సమావేశమయ్యాము.
మా సభ్యులలో ఒకరైన దుర్గ  మహనీయులు బాపూగారి గురించి మాట్లాడారు.  అందరం ప్రతి కుటుంబంలోనూ ఒక మనిషిగా కలిసిపోయిన ఆయన గొప్పదనాన్ని ఇంకోసారి గుర్తు చేసుకున్నాం.
ఈ కుడిపక్కనున్నావిడే దుర్గ.



     అందరం ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటుంటే ఇంకిది పని కాదని కమలాటీచర్ ఒక పేజీకి రెండువైపులా, మొత్తం నలభైమార్కులకి క్వశ్చన్ పేపర్ ఇచ్చేసారు. టీచర్ గారి అనుభవం ఎక్కడికి పోతుందీ.. ఇరవై ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్, మిగిలిన ఇరవైలో కొన్ని ఖాళీలు పూరించడాలూ, జంటపదాలు వ్రాయడాలూ, ఇంకా ఇలాంటివే వు   న్నాయి. అన్ని ప్రశ్నలూ కూడా జనరల్ నాలెడ్జ్, పురాణాలూ, ఆరోగ్యాలూ, దేశానికి సంబంధించినవీ అన్నీ వున్నాయి. తెలుగుభాషలో ఎంత బాగా తయారుచేసారో ఆవిడ.. అందుకు ఆవిడకు శతథా సహస్రథా నమస్కారాలు చెప్పుకోవచ్చు.

    ఇంక అందరం ఆన్సర్లు వ్రాయడంలో ములిగిపోయాం. ఆవిడ  పదినిమిషాలు టైమిచ్చారు. అయినాసరే.. అదేదో పెద్దపరీక్షలాగా వాళ్ళు వచ్చి చేతిలోది లాక్కునేవరకూ ఏదో రాసేస్తూనే వున్నాం.
      నేనైతే మల్టిపుల్ ఛాయిస్ కి చాలా ఆనందపడిపోయి, అదేదో సినిమాలో రవితేజా చెప్పినట్టు మొదటిది (ఎ), రెండోది (బి), మూడోది (సి) నాలుగోది (డీ) అలా వరసగా పెట్టుకుంటూ పోయాను. తర్వాతివాటికి కాస్త ఆలోచించాల్సొచ్చింది.
     హమ్మయ్య.. పరీక్షైపోయింది. ఇదిగో ఈ టీచర్ అందరి మార్కులూ పైకి చదువుతున్నారు. అందరం చప్పట్లు కొడుతూ, నవ్వుతూ వింటున్నాం.

 మధ్యలో కూర్చుని చప్పట్లు కొడుతున్న గాయత్రిగారికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 34/40



     ఇక్కడ చప్పట్లు కొట్టే రాజ్యలక్ష్మిగారికి సెకండ్ ప్రైజ్. 33/40
 
నాకు --32/40 మా చెల్లెలు భారతికి--31/40

మా సభ్యులు..



అన్నట్టు వీడేనండీ మా చీఫ్ గెస్టూ..

   తర్వాత భారతి పాట నేర్పిస్తే అందరం నేర్చుకున్నాం.  ప్రతి మీటింగ్ లోనూ ఒక పాట ఒకరు నేర్పించాలీ, అందరం నేర్చుకోవాలీ అనుకున్నాంలెండి.

  ఆపైన గాయత్రీ, పద్మామూర్తీ పాటలూ, పద్యాలూ పాడారు.






   
    ఇంక అసలు విషయానికొద్దాం. అదేనండీ భోజనాలు. కమలగారి అమ్మాయి శైలజ, కోడలు కలిసి మా అందరికోసం యెంత చక్కగా చేసారో అన్నీను. టొమేటోపప్పు, ఆలూ ఉప్మాకూర, కేరట్, బీన్స్ కలగలుపుకూర, చింతకాయ పచ్చడి, టమేటోపచ్చడి, దప్పళం, జిలేబీలు, పులిహార, అప్పడాలు, పెరుగు..హమ్మయ్య.. అన్నీ చెప్పానా.. ఆ అన్నట్టు రామలక్ష్మిగారు బజ్జీలు చేసి తెచ్చారు.  

వీరే కమలగారూ, వారి అమ్మాయి శైలజ. కోడలుకి పాపం జ్వరం వచ్చేసింది. (మమ్మల్ని చూసి కాదండోయ్.) పడుకుంది.
 
     తీరుబడిగా, కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి, తంబోలా ఆడి, డబ్బులు పంచుకున్నాక అందరికీ ఇళ్ళు గుర్తొచ్చేయి. అప్పుడింక తప్పదనుకుంటూ “పోదామా.. ఇక పోదామా.. “అనుకుంటూ ఎవరిళ్ళకి వాళ్లం చేరుకున్నాం. అవండీ మొన్న జరిగిన మా మీటింగ్  విశేషాలు.