Pages

Thursday, October 29, 2015

లలితామహిళామండలి యిరవైరెండవ వార్షికోత్సవం






ఈ నెల 28న మా లలితామహిళామండలి యిరవైరెండవ వార్షికోత్సవం అత్యుత్సాహంగా జరిగింది.

వార్షిక నివేదిక సమర్పిస్తున్న కార్యదర్శిని భారతీప్రకాష్.



 

     ఎప్పటిలాగానే మా సభ్యులు ఈ సంవత్సరం కూడా కొన్ని పోటీలు నిర్వహించారు. వ్యతిరేకపదాలపై పోటీ పెట్టి సభ్యుల తెలుగు పాండిత్యాన్ని పరీక్షించి, బహుమతు లందించారు దుర్గ.
 
     మహాభారతం మీద సుమారు అరవై ప్రశ్నలవరకు సంధించి, భారతంలో యెవరి కెవరు యేవిధంగా బంధువులో, యెవరెవరికి యే దేవతలు యే అస్త్రాలు యిచ్చారో అనే ప్రశ్నలతో సభ్యులని మహాభారతంలోకి తీసికెళ్ళి, గెలిచినవారికి బహుమతులందజేసారు రాజ్యలక్ష్మి.
 
  సభ్యులందరూ ఉత్సాహంగా పోటీల్లో  పాల్గొన్నారు.
 
 
 
 
 
 
ఆపైన సభ్యులు కొందరు తమ ప్రతిభాపాటవాలను చాటుకున్నారు.
కమల చక్కటి కథను వినిపించారు.
 
 
 
దుర్గ అందరికీ అవసరమయే చక్కని కథను చెప్పారు.
 
 
రామలక్ష్మి నాటకం వేసినప్పటి అనుభవాలు చెపుతూ సహజనటి అనిపించుకున్నారు.
 
రాజ్యలక్ష్మి అందరూ ఆమోదించే తెలుగు సామెతలని గుర్తుచేసారు.
 
 
సుందరిగారు “కస్తూరి రంగ రంగా “ట్యూన్ లో దేవి మీద చక్కటి పాటను వినిపించారు.
 

భారతి బుధునిమీద కీర్తన పాడింది.




 సీతగారమ్మాయి, ఆస్ట్రేలియాలో వుంటుంది. వాళ్ళ అమ్మగారి ఫ్రెండ్స్ అయిన  మమ్మల్నందర్నీ కలవాలని సరదాగా వచ్చింది. చిలకలా వుంది. చక్కటి కీర్తన, భజన పాడింది.


   తర్వాత విద్యుల్లత, సరస్వతి, ఉమాసుందరి కలిసి “అన్నయ్య-టాబ్లెట్” అనే స్కిట్ వేసారు. తమ అన్నయ్య వదినని యెలా భ్రమలో పెట్టేస్తాడో అని ఆడపడుచులు వదినని వేళాకోళం చేసే ఈ స్కిట్ చాలా సహజంగా వుండి, అందరినీ ఆనందపరిచింది.
 
ఆ తర్వాత నేనూ, భారతీ కలిసి “సంసారంలో సంగీతం..” అనే స్కిట్ చేసాము.


 
 ఇంక అసలు విషయానికొస్తే.. ఇదిగో  చక్కటి విందుభోజనం.
 


 

 








 
 అన్నట్టు మా సభ్యుల గ్రూప్ ఫొటో ఇదిగో..
 
వచ్చిన గెస్ట్ లతో..
 
 
అందరం హాయిగా ఆరగించి, మళ్ళీ యెప్పుడు కలుసుకుంటామో అనుకుంటూ యిష్టం లేకుండానే యింటిదారి పట్టాం.
------------------------------------------------------------------------------------------------------------

 

Friday, October 16, 2015

దసరా సంబరాలు..

   దసరా నవరాత్రులంటే మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. అమ్మవారికి ఒక్కొక్కరోజు ఒక్కొక్కపేరుతో రోజుకొక్క రీతిగా అలంకరణ, పూజ, నైవేద్యాలు చెయ్యడం మనందరికీ తెలిసిందే. బొమ్మలకొలువులు, తెలంగాణాలో అయితే బతుకమ్మలు మనలో వున్న సృజనాత్మతని వెలికితీస్తాయి.
   చిన్నప్పుడయితే మా అమ్మగారు పూజ అయ్యాక కీర్తన పాడనిదే పూజ పూర్తయినట్టు కాదనేవారు. ఆ పూజాక్రమంలో “గీతం సమర్పయామి”, “నృత్యం సమర్పయామి.” అని వుంటుంది కనక గీతం పాడితేకాని  ఊరుకునేవారు కాదు. అలాగ అమ్మవారి పూజ అయ్యాక మంచి కీర్తనలు, చక్కటి నృత్యం చూసే భాగ్యం కలిగిందివాళ నాకు. మాకు తెలిసినవారమ్మాయి యామిని డాన్స్ వుందంటే మహిళాసభకి వెళ్ళాను.  వెళ్ళినందుకు మనసు నిండుగా అక్కడ సంగీత, నృత్యవిశేషాలను చూసి వచ్చాను.

  ఆంధ్ర మహిళాసభలో వున్న కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవాళ సరస్వతీపూజ కనులపండుగగా చేసారు.  సరస్వతీదేవీ, బొమ్మలకొలువు, బతుకమ్మలు అన్నీ ఎంత అందంగా అమర్చారో. చూడడానికి రెండుకళ్ళూ చాలలేదు. ఇదిగో మీరూ చూడండి. 







  
  బతుకమ్మలను చూసారా.. ఎంత అందంగా పేర్చారో..
 పూజ, హారతి అయ్యాక సంగీత కళాశాల విద్యార్ధినులు కీర్తనలు పాడారు. అధ్యాపకులు దగ్గరవుండి తాళం వేస్తుంటే ఎంతో శ్రధ్ధగా పాడిన ఆ కీర్తనలు ఆహూతులని ఎంతో ఆనందపరిచాయి.









   తర్వాత  పద్మశ్రీ శోభానాయుడుగారి శిష్యురాలు, ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు అందుకున్న కుమారియామిని కల్లూరి నృత్యం మొదలైంది. “కంజదళాయతాక్షీ..కామాక్షీ..” అన్న కీర్తనను ఎంతో భావ,తాళయుక్తంగా అభినయించి ప్రేక్షకులని సమ్మోహితులని చేసింది యామిని. తపస్సు చేసుకుంటున్న శివునికై పార్వతి చేసిన తపస్సు, వారిని కలిపే ఉద్దేశ్యంతో మన్మథుడు శివునిపై పూలబాణం వదలడం, ఆగ్రహించిన శివుడు మన్మథుని  మసిచేయడం, తర్వాత శాంతించిన శివుడు మన్మథుని క్షమించడం వంటి దృశ్యాలన్నీ ప్రేక్షకుల కనులముందు సాక్షాత్కరింపజేసింది. 





  మళ్ళీ సంగీత కళాశాల విద్యార్ధినులతో గీతాలాపన కొనసాగింది. 

  ఎంతో ఆనందంగా పూజ, సంగీతకచేరీ, నృత్యం చూడడానికి వచ్చినవారందరికీ అమ్మవారి ప్రసాదాన్నిచ్చి, ఆప్యాయతతో సాగనంపారు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ రమాప్రభగారు. 

ఇరిగో వీరే ఆ ప్రిన్సిపల్ రమాదేవిగారు యామినిని అభినందిస్తూ..



    అలాగ సంగీత కళాశాలవారి సరస్వతీపూజకు వెళ్ళడం వలన నవరాత్రులలో ఇవాళ ఇంత ఆనందంగా దేవిని సేవించుకోవడం నా అదృష్టంగా అనిపించింది. 
----------------------------------------------------------------------------------------