Pages

Wednesday, May 18, 2011

ఎవరు చెపుతారు...!





మా అమ్మమ్మ చేతి తరవాణి అమృతతుల్యం
నాకింకా గుర్తే...
పెరట్లో పాలేళ్ళు- పొలాల్లో పనివాళ్ళు
యింట్లో పసివాళ్ళు-వీధిలో కుర్రాళ్ళు
పిన్నలు పెద్దలు చుట్టపక్కాలు
ఆ ఊళ్ళో అందరికీ అన్నపూర్ణ మా అమ్మమ్మే.

మరిక మా అమ్మ...
ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలు
అత్తగారు మామగారు మరదులు తోడికోడళ్ళు
ఆదపడుచులూ-యింటి అల్లుళ్ళూ
తన పిల్లలు పరాయిపిల్లలనే తేడాలు లేకుండా
పిన్నా పెద్దా అందరికీ చల్లనితల్లి మా అమ్మే...

ఇక మా సంగతా...
పొట్ట చేత పట్టుకుని ఊళ్ళు పట్టుకు పోయినవాళ్లం
మేమిద్దరం మాకిద్దరూ అనుకున్నవాళ్ళం
యేడాదికో రెండేళ్ళకో కుటుంబాలన్నీ కలిసాయంటే
అది ఒక ఆనందహేల...

సరే మా అమ్మాయి...
ఒక్కతే కూతురితో సరిపెట్టింది
తోడుగా మరొకర్ని కనమంటే
దీనిని బాగా పెంచాలికదా అంటుంది
సంబరంగా కలిసి తిరిగే తోబుట్టువు లేక
దుఃఖంలో పాలు పంచుకునే దిక్కు లేక
ఒంటికాయ శొంఠికొమ్ములా పెరిగిన నా మనవరాలు
యిప్పుడంటుందీ...
"నాకు పెళ్ళొద్దూ..." అని
ఎందుకనడిగితే స్వేఛ్ఛకి భంగమట
మరొకరి సహవాసం కోసం తన స్వతంత్రాన్ని వదులుకోలేదుట...

అణువు అణువణువై
అణువణువు పరమాణువై
పరమాణువు పెఠిల్లుమంటె
యిక మిగిలేది శూన్యమేనని
తనకెవరు చెపుతారు...!


"రచన--ఇంటింటిపత్రిక" సౌజన్యంతో....


+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Tuesday, May 10, 2011

తల్లీ...నిన్ను దలంచి...




తల్లీ…. భారతి….
నిన్ను తలంచి నేను పట్టిన పొత్తము ఈ విధి భంగమయ్యె
ఏమని చెప్పుదు నాదు దుస్ఠితిన్...

ఉదయమున నిను దలంతునన్న
అరుణకిరణములు సోకని నివాసమయ్యె
మనసు కుత్సాహము లేక మౌని నైతి…….

చైతన్యముతో పట్టువిడక
నీదుగురించి నాల్గు వాక్యముల్ చెప్పుదమన్న
ఏమి పాపము చేసితినొ గాని
వినెడి విద్యార్థి ఎందును కానరాడు…….

నిను తనివార పూజింప విరిసిన పూలుతేబోవ
హతవిధీ.. ఏమని చెప్పుదు ఎక్కడ కాంచిన
కృత్రిమ పుష్పరాజములె గోచరమయ్యె…..

మదిని కలవరమ్ముతో,
తెగని పట్టుదలతో,
ఎటులైన నీదు మహిమలు,
నిను పఠించిన పొసగు మహానందములు,
నీదు దీవెనచే కలుగు పుణ్యములు,
నీదుపై ఏకాగ్రతతో కలుగు అద్వైత సిధ్ధి,
మనఃపీఠమున నిను స్థాపించిన పొందు కైవల్యము,
మరి ఎందును కానరాదని తెలియచెప్పుదుమన్న
వినెడివారు కరవైరి...ఏమనందు...

తల్లీ...భారతీ..నిను కొలవగలేని దౌర్భాగ్యపు జాతి అయినది
వేద విఙ్ఞానఖని అయిన అమృతభాండము ఎదుట నుండగా
ఎడారిలో ఎండమావికై పరుగులిడు యాతన
ఈ పిచ్చి జనుల మది కెందుకొ….

చలము సేయక
నీవు వారిని చల్లగ చూసి
పెడదారి పట్టిన పిలవాని త్రోవ మరల్చి
నీ అక్కున చేర్చి బ్రోవుమ తల్లి శారదా....



-------------------------------------------