Pages

Thursday, June 23, 2011

లాఠీఛార్జి..

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన "మఱపురాని అనుభవాలు " పుస్తకంలో మరో ఙ్ఞాపకం.



సత్యాగ్రహం రోజుల్లో సత్యాగ్రహం కోసమై మహాత్ముని పిలుపునందుకుని ప్రతి ఊరులోను కాంగ్రెసువారు ప్రత్యేకంగా కొంతమంది వాలంటీర్లకు శిక్షణనిచ్చేవారు. వారి పేర్లను నమోదు చేసుకొని, వరుసగా వారికి సత్యాగ్రహం చేయడానికి అవకాశం ఇచ్చేవారు. నూటనలుబది నాల్గవ సెక్షను ధిక్కరించడమనేది సత్యాగ్రహంలో ఒక భాగం. రోజూ ఉదయం పదిగంటలకు కాకినాడలోని మసీదు సెంటరుకు ఐదుగురు వాలంటీర్లు "వందేమాతరం మహాత్మాగాంధీకీ జై !" అంటూ నినాదాలు చేస్తూ వచ్చేవారు. నలుగురికన్న ఎక్కువమంది ఒకచోట సమావేశం కాకూడదనే ఆర్డరును ధిక్కరించేవారు. అప్పటికి అక్కడ సిధ్ధంగా ఉన్న పదిపన్నెండుమంది పోలీసు సిబ్బందీ వాలంటీర్లు సెంటరులోనికి రాగానే తమ లాఠీలతో వారిని కొట్టడం మొదలుపెట్టేవారు. ఆ వాలంటీర్ల శిక్షణ ఎలాంటిదంటే, లాఠీదెబ్బలు వర్షంలా శరీరంపై పడుతున్నప్పటికీ తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. చెయ్యెత్తి ఆ దెబ్బలను వారించుకోకూడదు. అలా ఆ దెబ్బలను భరిస్తూ ఉండిపోవలసిందే. స్పృహ తప్పి క్రింద పడిపోయేవరకూ "వందేమాతరం" అంటూనే ఉండేవారు. స్పృహ కోల్పోయి రోడ్డుమీద పడిపోయినవారిని ఒక్కొక్కరినీ కాళ్ళు పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకుపోయి ముఱికికాల్వ ప్రక్క పడేసేవారు.
ఆ వాలంటీర్లకు ప్రథమ చికిత్స చేసిన వారిని, మంచినీరు ఇచ్చేవారిని నిర్బంధించి జైలుశిక్ష వేసేవారు. ఆ విధంగా వారు రాత్రివరకూ పడి ఉన్నాక, అర్ధరాత్రి పోలీసులు ఆ స్థలం నుండి కదిలిపోయేక వాలంటీర్లు వచ్చి స్పృహలేనివారిని భుజాలపై వేసుకొని తీసుకొని వెళ్ళేవారు.
ఆ సంఘటన జరిగేటప్పుడు ఆ మెయిన్ రోడ్డు పైనున్న జనం యావత్తూ రెండువైపులనున్న అరుగుల మీదకు పాఱిపోయి కండ్లవెంట నీరు కార్చేవారు. అటువంటి లాఠీచార్జికి గుఱిఅయి చనిపోయినవారు కొందరైతే, అవయవలోపంతో జీవితాంతం బాధపడ్డవారు చాలామంది.
ఈ రీతిగా లాఠీఛార్జికి గురయిన సత్యాగ్రహుల అవస్థ చూసి కూడా, మరునాడు ఉదయం 10 గంటలకు ఇంకొక అయిదుగురు వాలంటీర్లు శాసనోల్లంఘన చేయడానికి ఉద్యుక్తులై వచ్చేవారు. వారు కూడా అదే అవస్థననుభవించేవారు. ఆ రోజులలోని సత్యాగ్రహం, దేశభక్తి, ఉత్సాహం, త్యాగబుధ్ధి అలాంటిది. ఆ త్యాగమూర్తులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వారి పేర్లు కూడా చరిత్రకెక్కకుండా, సత్యాగ్రహసమరంలో ఆహుతి అయినవారు వేనకు వేలున్నారు.
ఎంతమంది నిస్స్వార్ధపరుల త్యాగఫలమో యీ స్వాతంత్ర్యం !


________________________________________________________________________

Tuesday, June 21, 2011

"మఱపురాని అనుభవాలు"

మా నాన్నగారు "పిడపర్తివారు--కథలూ-గాధలూ" అని పిడపర్తివారి వంశచరిత్ర,, జ్యోతిష్యంలో వారికి గల అసమాన ప్రతిభ తెలిపే కొన్ని కథలూ కలిపి ఒక పుస్తకంగా వ్రాసారు. వాటి గురించి తర్వాత ప్రస్తావిస్తాను.
ఇప్పుడు మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన ఇంకో పుస్తకం "మఱపురాని అనుభవాలు" అన్నదానిని గురించి చెపుతాను. ఈ పుస్తకం ముందుమాటలో ఆయనే వ్రాసుకున్న మాటలు...
"నా జీవితకాలంలో నేను చూసినవి రెండు ప్రపంచ యుధ్ధాలు, దేశంలో జరిగిన సత్యాగ్రహ సమరము, తదుపరి నేను విధులు నిర్వహించిన ప్రభుత్వాలు రెండు; ఒకటి బ్రిటిష్ ప్రభుత్వము, రెండవది మన దేశ నాయకుల ప్రభుత్వములో. నా విధి నిర్వహణలో ఆఫీసర్లుగానున్న తెల్లదొరలతో వ్యక్తిపరమైన సంబంధం ఉండేది.
ఈ పై విషయాలను బట్టి మీరు గ్రహించేయుంటారు నా జీవితానుభవాలు అనేకములనీ, కొన్ని అసాధారణములై ఉంటాయనీ కూడా. నా మిత్రులతో ప్రసంగిస్తున్నప్పుడు ఈ అనుభవాలను కొన్ని వారికి విన్పింపగా వారు అనందించి, నా అనుభవాలను కొన్నింటిని పుస్తకరూపంలో అందించమని కోరారు. వారి కోరిక ఫలితమే ఈ చిన్న పుస్తకము. ఇందులో నేను చూపిన అనుభవాలు దేశంలోని మహనీయుల గొప్పతనాన్ని యెత్తిచూపడానికే గాని, నా గొప్పతనం కోసం గాదు."
అల్లూరి సీతారామరాజు



మా చిన్నతనంలో ఎంతో ఆసక్తితొ విన్నదీ, కన్నదీ అల్లూరి సీతారామరాజును గుఱించి. ఆయన జీవిత చరిత్ర నాటక రూపంలోనూ, చలనచిత్రరూపంలోనూ బాగా ఈమధ్య ప్రచారం కాబడింది. అందులో చూసిన సంఘటనలకున్నూ, మాకు మా చిన్నతనంలో తెలిసిన సంఘటనలకున్నూ చాలా వ్యత్యాసం కనబడుతుంది. ముఖ్యంగా రూథర్ పోర్డ్ షూట్ చేయగా సీతారామరాజు చనిపోయినట్లు చిత్రంలో చూపించారు అయితే మా చిన్నతనంలో మేము విన్న విషయమిక్కడ తెలియపరుస్తాను.
శ్రీ సీతారామరాజు సుమారు వందమంది అనుచరులతో ఒకనాటి రాత్రి అడవిలో నిర్జన ప్రదేశంలో నిద్రపోతూ ఉండగా, ఈ విషయం చారుల వలన తెలిసికొన్న తెల్లదొరలు కమాండర్లుగానున్న మలబారు స్పెషల్ పోలీసుదళం వారిపై ఒక్కసారి విరుచుకు పడి షూటింగ్ చేయడానికి సిధ్ధపడ్డారు. నిద్రలోనున్నవారు నిద్రనుండి లేవాలన్నా ఆ అవకాశం లేకపోయింది. వెంటనే ఒక వ్యక్తి ఆ కమాండర్ల దగ్గఱకు వచ్చి యెదురుగా నిల్చి, తానే సీతారామరాజుననీ, తాను లొంగిపోతున్నాననీ, షూటింగ్ ఆర్డర్లు ఇవ్వవద్దనీ చెప్పాడు. వెంటనే అతనిని అరెస్టు చేసారు. అతని అనుచరులు తప్పించుకొనిపోవడానికి అవకాశం కలిగింది. ఆ తెల్లదొరలు సీతారామరాజును పట్టుకోగలిగినందుకు మురిసిపోతూ, అతనిని జిల్లా ప్రధాన నగరమైన కాకినాడలో సబ్ జైల్ లో ఉంచేరు. దొరలు చేసిన ఘనకార్యం వార్త వెంటనే ప్రభుత్వంలోనున్న అధికారులందరికీ తెలియజేయబడింది. "Secretary of State for India in London" కు కూడా ఈ వార్త ఆఘమేఘాలమీద చేరింది. ఇంతటి సాహసం చేయగల్గిన ఆ తెల్లదొరల కమాండర్లు పై ఆఫీసర్ల అభినందనల వర్షంలో మునిగితేలేరు. ఇక్కడ చిన్న విశేషముంది. సీతారామరాజు ఉద్యమం నడిపినప్పుడు, తన చేతికి చిక్కిన దొరలనాతడు బ్రతకనీయలేదు. మన హిందువులు చేజిక్కినప్పుడు కొంత మందలించి విడిచిపెట్టేవాడు. అందువలన తాము అరెస్ట్ చేసిన వ్యక్తి సీతారామరాజు అవునోకాదో ఆతెల్లదొరలకు తెలియదు. ఆ వ్యక్తి మాట మీదే ఆధారపడి వ్యవహరించేరు. జైలులో నున్న వ్యక్తిని చూచిన హిందూ ఆఫీసరెవరో ఒకాయన ఆ పట్టుబడిన వ్యక్తి సీతారామరాజు కాదు అన్నాడు. వెంటనే ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇదివరలో సీతారామరాజు చేత పట్టుబడి వదిలి వేయబడిన ఇద్దరు ఆఫీసర్లను పిలిపించేరు. వారు కూడా ఆ వ్యక్తి సీతారామరాజు కాదని ధృవపరచారు. పట్టుబడిన రోజున, సీతారామరాజును రక్షించడానికే, ఇంకొక వ్యక్తి తానే రాజునని లొంగిపోయేడని నిశ్చయంగా ఋజువయింది. ఆ రోజుల్లో సబ్ జైల్ గోడలమీద నుండి ఆ జైలులో నున్న సీతారామరాజును చూడడానికి ప్రయత్నించిన చిన్నపిల్లలలో నేనొకడిని.
ఆ పరిస్థితులలో ఇంక చేసేదేమీలేక ప్రభుత్వంవారు ఆ వ్యక్తిని షూట్ చేసి చంపేశారు. జైలునుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటే, షూట్ చేయవలసి వచ్చిందని ప్రచారం చేసేరు. అందువలన ఇంక కోర్టులూ, నేరాలూ, సాక్ష్యాలు మొదలయిన చర్యలన్నింటికీ స్వస్తివాక్యం పలికారు.
ఇంతకూ సీతారామరాజు ఏమయ్యారని ఆ రోజులలో ఏ కోయవారి నడిగినా, ఆయన చనిపోలేదనీ, విరక్తి చెంది, అడవులలో తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయారనీ చెప్పేవారు. విరక్తి ఎందుకంటే, సీతారామరాజు ఉద్యమం నడిపేటప్పుడు కోయ మగవారు చాలామంది ఆయనతో ఉండగా, మలబారు స్పెషల్ పోలీసుదళంవారు తెల్లదొరలకమాండ్ లో పల్లెల మీద పడి నానాభీభత్సం చేసేవారట. స్త్రీలను హింసించి, పిల్లలను బాధపెట్టి, ఇండ్లను అగ్నికి ఆహుతిచేసి విపరీతమైన అరాచకం జరిపేవారనీ, ఆ వార్తలు వింటున్న సీతారామరాజుగారు చాలా బాధ పడుతుండేవారనీ, కొన్నాళ్ళకు ఆయనకు విరక్తి కలిగి ఈ ఉద్యమం ఆపవలసి వచ్చిందనీ, ఆయన తపస్సు చేసుకునేందుకు అడవులలోనికి వెళ్ళిపోయారనీ చెప్పేవారు.
1925వ సంవత్సరములోను, 1926వ సంవత్సరములోను అల్లూరి సీతారామరాజు చరిత్ర పుస్తకరూపంలో వచ్చింది. ఈ వివరాలు అందులో తెలియపరచారు. ఆ నకిలీ సీతారామరాజు ఫొటో కూడా ఆ పుస్తకంలో ఉన్నది.

(చిత్రం.. గూగులమ్మ సౌజన్యంతో..)


________________________________________________________

Sunday, June 19, 2011

మా నాన్నగారు...




అందరు తండ్రులకూ వారి అమ్మాయిలు బంగారుతల్లులే...
అందరు అమ్మాయిలకూ వారి నాన్నలు కల్పవృక్షాలే...
కావచ్చు... కాదనను... కాని...
మా నాన్నగారికి మేము ఆడపిల్లలం నలుగురం కూడా
పుటం పెట్టిన ఇరవైనాలుగు కేరట్ల బంగారులం...
అలాగే మా నాన్నగారు మాకు కల్పవృక్షం, కామధేనువు...ఇంకా ఎన్నో...

ఎంత పాండిత్యముందో అంత వినయంగానూ వుండేవారు
ఎదుటివారి వయసెంతయినా సరే ఎంతో గౌరవమిచ్చి మాట్లాడేవారు

ఆయన మాకు అందించిన నిధి సామాన్యమయిందికాదు..
ఆయన గురించి ఏ ఒక్కటని చెప్పను..
ఎక్కడ మొదలుపెట్టడం..?
ఎక్కడ చూసినా ఆయన చెప్పిన మాటే..
ఆయన మాకు చెప్పని విషయం అంటూ లేదు.

పద్యాలలో పొదిగిన అందాల్ని ఆస్వాదించి ఆనందించడం ఆయనే మాకు నేర్పారు.
ఆశువుగా పద్యాలు చెప్పేవారు. సమస్యాపూరణలు, దత్తపదులూ అలవోకగా చెప్పేవారు.

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు కీర్తిశేషులయి ఈనాటికి సరిగ్గా సంవత్సరం అయింది.
ఈ రోజున ఆయన స్మృతులకు ప్రణతులర్పిస్తూ, వారు వ్రాసిన రెండు దత్తపదులను ఇక్కడ వుంచుతున్నాను.

ఇచ్చిన పదము..."సారము" అనే పదము నాల్గుపాదాలలో ఉపయోగించి ఒక వృత్తపద్యము.

సారము లేని భూమియును, సారస లోచన లేని వాని సం
సారము, యోగ విద్య తగు సాధన లేనిది, నీరు లేని కా
సారము, యోగ్యమైన దగు సంతతి కల్గని జీవితమ్ము, ని
స్సారములంచు పల్కెదరు సారెకు సారెకు విఙ్ఞులందఱున్.

"పాక, పీక, పేక, పోక.." ఈ నాల్గు పదాలు ఉపయోగించి రామాయణార్ధంలో ఒక వృత్త పద్యము.

పాకలు కావు కాలినవి, బంగరు మిద్దెలె మండిపోయె, మా
పీకల మీదకే ప్రభువు పెట్టెను, అతని దుష్టమౌ తలం
పేకద తెచ్చిపెట్టినది భీకరమైన విపత్తు, రాజుకీ
పోకడ లేమిటో యనుచు భోరున నేడ్చిరి లంకలో ప్రజల్.






++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++