Pages

Monday, July 25, 2011

దొరగారి ప్రశ్న.

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన "పిడపర్తివారు-కథలూ-గాథలూ" పుస్తకం లోని మరో కథ.
మా చిన్నప్పుడు ఈ కథని మా నాన్నగారు ఎంతో నాటకీయంగా చెపుతుంటే చెవులు దోరగిలబెట్టి వినేవాళ్లం.





విజయనగర ప్రభువులు విజయరామ గజపతులు పద్మనాభం దగ్గర జరిగిన యుధ్ధంలో మరణించిన అనంతరం అప్పటికి పదహారు సంవత్సరముల వయస్సులో నున్న వారి కుమారులు నారాయణ గజపతులు అడవులలోనికి పారిపోయారనీ, కొంతకాలానికి విజయనగరానికి తిరిగివచ్చి బ్రిటిష్ వారికి అపరాధ రుసుము చెల్లించగా వారు విజయనగర సంస్థానాన్ని నారాయణ గజపతులకు అప్పగించేరనీ తెలుస్తోంది. మరల రాజ్యం లభించిన కారణంగా శ్రీ నారాయణ గజపతులు వారి ఆప్తులకూ, తనకు కష్టసమయంలో సాయపడినవారికీ యీనాములిచ్చి కృతఙ్ఞతలను తెలుపుకున్నారు.

శ్రీ నారాయణ గజపతులే పిడపర్తి సీతారామశాస్త్రిగారికి వారి ప్రఙ్ఞకు మెచ్చి కొన్ని యీనాం భూములను యిచ్చేరు. ఆ యీనాం భూములకు బదులు క్రీ.శ. 1811 వ సంవత్సరములో బూరాడపేట అనే లక్ష్మీనారాయణపురం అగ్రహారాన్ని వారికి బహూకరించేరు.

క్రీ.శ. 1822 వ సంవత్సరం నాటికి అప్పటి మహారాజావారు శ్రీ శాస్త్రిగారి వారసులపై ఆ అగ్రహారం స్వాధీనం నిమిత్తం విశాఖపట్టణం సబ్ కోర్ట్ లో దావా వేసేరు. సబార్డినేట్ జడ్జి శ్రీ ఏ.ఎల్.వి.రమణగారు ఆ దావాలో మహారాజావారికి అనుకూలంగా తీర్పు నిచ్చేరు. ఆ తీర్పుపై శ్రీ శాస్త్రిగారి వారసులూ తదితరులూ మద్రాసు హై కోర్టులో అప్పీలు దాఖలు చేసేరు. ఆ అప్పీలు విచారణ సమయంలో జరిగిందని ప్రచారములోనున్న యీ క్రింది గాధను చిత్తగించండి. ఆ అప్పీలు మద్రాసు హైకోర్టులో విచారణకు చీఫ్ జస్టిస్ టర్నరు దొరగారున్నూ, జస్టిసు ముత్తుస్వామి అయ్యరుగారున్నూన్యాయపీఠం మీద కూర్చుని ఉన్నారు. శ్రీ శాస్త్రిగారి తరఫున వారి పాండిత్యముచే వాదిస్తున్న వకీలుగారు యీ క్రింది విధంగా వారికి మనవి చేసేరు.

"ప్రభువులు చిత్తగించాలి. అప్పీలుదారులు పిడపర్తి వంశానికి చెందినవారు. వారి వంశం కొన్ని శతాబ్దాలనుండి కూడా జ్యోతిశ్శాస్త్ర పాండిత్యానికి ప్రసిధ్ధి జెంది ఉన్నది. ఆ వంశమునందు జన్మించిన శ్రీ సీతారామశాస్త్రిగారు వంశ పరంపరాగత జ్యోతిర్విద్యాసంపన్నులు. వారి పాండిత్యముచే శ్రీ నారాయణ గజపతులను మెప్పించిన కారణంగా మహారాజులు వారికి కొన్ని భూములను యీనాములుగా యిచ్చి క్రీ.శ. 1802 పెర్మినెంటు సెటిల్మెంటు అనంతరం ఆ యీనాం భూములకు బదులుగా బూరాడపేట అనే లక్ష్మీనారాయణ పురం అగ్రహారాన్ని వారికి క్రీ.శ. 1811 వ సంవత్సరంలో వంశపారంపర్యంగా అనుభవించడానికి కొంత కట్టుబడిపై దఖలు పరచియున్నారు.”

టర్నరు దొరగారు ఆశ్చర్యం ప్రకటిస్తూ యిల్లా అన్నారు.
"మీ దేశంలో ప్రభువులు గ్రామాలకు గ్రామాలే బహుమానాలుగా యిచ్చేస్తుంటారా ?"

వకీలుగారు:- చిత్తం. మా ప్రభువులు యెప్పుడూ చాలా దానగుణం కలవారే ప్రభూ!
టర్నరు:- అయినా యీ రీతిగా గ్రామాలకు గ్రామాలే యిచ్చేస్తుంటే కొంతకాలానికి ప్రభువుల రాజ్యపరిమితి కూడా తగ్గిపోతుందేమో?
వకీలు:- గ్రామాలను కొంత కట్టుబడిపై యిస్తూ అనుభవించడానికి మాత్రమే యిస్తారు. రాజ్యానికే లోటూ జరగదు. అయినా యిల్లా బహుమతి పొందే అర్హత ఉన్నవారు చాలా తక్కువగా ఉంటారుకదా!
టర్నరు:- అదీ నిజమే ననుకోండి. గ్రామాలు బహుమానంగా పొందే అర్హత అప్పీలుదారులకు ఉన్నదా?
వకీలు:- సందేహంలేదు ప్రభూ! ప్రభువులు నారాయణ గజపతులు రామచంద్రపురం వెళ్ళినప్పుడు శ్రీ సీతారామశాస్త్రిగారి పాండిత్యాన్ని చూచినవారై వారికి కొంత భూమిని యీనాంగా యిచ్చి విజయనగరం రప్పించుకున్నారు.
టర్నరు:- నేను కూడా మా దేశంలో వింటూ ఉండేవాడిని జ్యోతిశ్శాస్త్రంలో పండితులు యీ దేశంలో శతసహస్రాలుగా ఉన్నారని. కాని నాకు యింతవరకూ అల్లాంటివారిని కలుసుకునే అవకాశం కలగలేదు.
వకీలు:- చిత్తం. పిడపర్తి వారి వంశమంటేనే జ్యోతిశ్శాస్త్రం ప్రభూ! ఆ వంశంలో పుట్టిన ప్రతి వ్యక్తీ కూడా ఆ శాస్త్రంలో నిష్ణాతులే.
టర్నరు:- చాలా ఆశ్చర్యకరమైన విషయమే. వారెవరైనా యిప్పుడిక్కడ ఉన్నరా?

వెంటనే వకీలుగారు కోర్టుహాలులో నున్న శ్రీ పిడపర్తి దక్షిణామూర్తి శాస్త్రిగారిని రమ్మని పిలిచి జడ్జిగారివైపు తిరిగి యిల్లా అన్నారు.

వకీలు:- ప్రభువులు చూడదలచుకుంటే అప్పీలుదారులు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారు యిక్కడే ఉన్నారు.
టర్నరు:- వారికి గౌరవ పూర్వక ప్రణతుల నందజేయండి. ఈ అప్పీలుకు సంబంధం లేకపోయినా నా ఆసక్తిని తెలియపరుస్తున్నాను. వారికి అభ్యంతరం లేకపోతే వారి పాండిత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని నాకు యివ్వగలరా?

వకీలుగారు శ్రీ శాస్త్రిగారిని సంప్రదించి వారి అంగీకారాన్ని జడ్జిగారికి తెలియపరిచేరు. టర్నరు దొరగారు జడ్జి ముత్తుస్వామి అయ్యరు గారితో పదినిమిషాలుపాటు మాట్లాడి వకీలుగారివైపు తిరిగి యిల్లా అన్నారు.

టర్నరు:- శ్రీ ముత్తుస్వామి అయ్యరుగారిని సంప్రదించినాను. జ్యోతిశ్శాస్త్రం మూడు విభాగాలుగా యీ దేశంలో ప్రసిధ్ధిజెంది ఉన్నదని తెలుసుకున్నాను. అందులో సిధ్ధాంతభాగంలోనూ జాతకభాగంలోనూ వారి పాండిత్యాన్ని తెలుసుకునే అవకాశం ప్రస్తుతం లేకపోవడం వలన ప్రశ్న భాగం లోనే వారి పాండిత్యాన్ని తెలుసుకోదలుచుకున్నాను. వారికేమైనా అభ్యంతరమున్నదా?

వకీలుగారు యీ విషయం శ్రీ శాస్త్రిగారికి తెలియపరచి వరికి అభ్యంతరం లేదన్న విషయాన్ని టర్నరు దొరగారికి తెలియజేసేరు. అంతట టర్నరు దొరగారు వకీలుగారితో యిల్లా అన్నారు.

టర్నరు:- రేపు ఉదయం నేను యీ కోర్టు హాలులోనికి ఏ మార్గం గుండా ప్రవేశిస్తానో చెప్పగలరా?

వకీలుగారు శ్రీ శాస్త్రిగారికి దొరగారు చెప్పినది తెలుగులో చెప్పేరు. శ్రీశాస్త్రిగారు ప్రశ్న సమయానికి గ్రహ స్థితులను పరిశీలించి అయిదు నిముషాల అనంతరం వకీలుగారి నడిగి కాగితం తీసుకుని ఆ కాగితంపై యేదో వ్రాసి మడతపెట్టి వకీలుగారికిస్తూ యీ కాగితం దొరగారికీయవలసిందిగానూ, మర్నాడు కోర్టుహాలులో ప్రవేశించిన అనంతరం యీ కాగితం చూసుకోవలసిందిగా మనవి చేయమని కోరేరు. వకీలుగారు ఆ కాగితం దొరగారికిచ్చి శ్రీశాస్త్రిగారు చెప్పిన రీతిగానే మనవి చేసేరు. దొరగారు సంతోషించి ఆ కాగితాన్ని వారి ఆఫీసు బాక్స్ లో పెట్టుకున్నారు. ఆ పైన ఆప్పీలులో వకీలుగారు చెప్పే విషయాలను వినడానికి ఉపక్రమించేరు.

మరునాడు కోర్టుహాలుకు వచ్చిన వకీళ్ళు, ప్రజలు ఆ హాలుకు తూర్పునున్న రెండుద్వారములకు మధ్యగా నున్న గోడ బ్రద్దలు కొట్టబడి మార్గం ఏర్పాటు చేయబడి ఉండడం గమనించేరు. కాని అది ఎందుకు అల్లా చేయబడిందో వారి ఊహకు అందలేదు. అందరూ హాలులో కూర్చున్నారు. ముత్తుస్వామి అయ్యరు వారి చాంబర్ నుండి వచ్చి న్యాయపీఠంపై ఆసీనులయ్యేరు. అందరూ టర్నరుదొరగారి రాకకోసం చాంబర్ కున్న ద్వారం వైపు చూస్తున్నారు. అంతలో టర్నరు దొరగారు తూర్పువైపు గోడకు బలవంతంగా పడగొట్టించి నూతనంగా ఏర్పరచిన మార్గం గుండా కోర్టుహాలులోనికి వచ్చి అందరూ ఆశ్చర్యంగా చూస్తూండగా న్యాయపీఠం మీద ఆసీనులయ్యారు. హాలులోనికి వచ్చిన వారందరూ కూర్చున్న మీదట దొరగారు వారి నుద్దేశించి యీ క్రింది విధంగా అన్నారు.

"నేను కోర్టుహాలులోనికి యీ క్రొత్తమార్గం గుండా ప్రవేశించడం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. దానికి కారణం చెబుతాను. నిన్న యీ కోర్టులో జరిగిన విషయాలు మీ అందరికీ తెలిసే ఉన్నాయి. నేనీ రోజు ఏ మార్గం గుండా యీ హాలులోనికి ప్రవేశిస్తానో తెలియపరచవలసిందిగా శ్రీ శాస్త్రిగారిని కోరేను. వారొక కాగితం మీద సమాధానం వ్రాసి యిచ్చి యీ రోజు న్యాయపీఠం మీద కూర్చున్నాక చూసుకోవలసిందిగా చెప్పేరు. నేను ఏ మార్గం ద్వారా లోపలికి వచ్చేనో మీరందరూ చూసే ఉన్నారు. శ్రీ శాస్త్రిగారు నా ప్రశ్నకేమి సమాధానం యిచ్చి ఉన్నారో చూద్దాం" అని వారి ఆఫీసుబాక్సునుండి కాగితం తిసి శ్రీ ముత్తుస్వామి అయ్యరుగారికిచ్చి చదవవలసిందిగా కోరేరు. శ్రీ అయ్యరుగారు యీ క్రిందివిధంగా చదివేరు.

"దొరగారు రేపు కోర్టుహాలులోనికి ఏ మార్గం గుండా ప్రవేశిస్తారో తెలుపవలసిందిగా సెలవిచ్చేరు. రేపు తూర్పువైపునున్న రెండు ద్వారాలకు మధ్యలో నున్న గోడలో బలప్రయోగం ద్వారా ఏర్పరచిన మార్గం గుండా కోర్టుహాలులోనికి ప్రవేశిస్తారనే విషయం ప్రశ్నకాలానికున్న గ్రహస్థితుల వలన విశదమౌతోందని నా మనవి."

ఇది విన్న కోర్టుహాలులోని జనమంతా నిర్ఘాంతపోయేరు. దీని తర్జుమా దొరగారికి శ్రీ అయ్యరుగారు వినిపించగానే దొరగారు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేరు.

శ్రీ శాస్త్రిగారి జ్యోతిశ్శాస్త్ర పాండిత్యానికి అక్కడునున్న జనులందరూ జోహారులర్పించేరు.



------------------------------------------------------------------------

Friday, July 15, 2011

సరస్వతిశాపం

పిడపర్తి వారి వంశ చరిత్ర, ఆ వంశస్థుల యొక్క పాండిత్య ప్రతిభ అందరికీ తెలియాలనే ఉద్దేశ్యముతో మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు "పిడపర్తి వారు- --కథలూ-గాథలూ" అని ఒక పుస్తకం వ్రాసారు. అందులో ప్రచురించిన "సరస్వతిశాపం" అను ఈ కథ "ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలోను, ఆంగ్లానువాదం Andhra Pradesh journal లోను ప్రచురించబడింది.
సరస్వతీదేవిని దేవతగా పూజిస్తూ, శాస్త్రాధ్యయనాన్ని ఒక తపస్సుగా భావించి, స్వార్ధ మనేదే లేకుండా, అతి సాధారణ జీవితం జీవిస్తూ, ఆ శాస్త్రాన్ని తరతరాలుగా నిలబెట్టడానికి కృషి చేసిన ఇలాంటి మహా మనీషులుండబట్టే ఈ కాస్త విఙ్ఞానమైనా ఇప్పటికి మిగిలి ఉందనిపిస్తుంది ఈ కథ చదువుతుంటే. అందుకే అభిలాషగలవారికోసం దీనిని ఇక్కడ ఉంచుతున్నాను.

సరస్వతిశాపం





కొన్ని శతాబ్దాల నుండి ప్రస్తుత కాలం వరకూ జ్యోతిశ్శాస్త్రంలోని అన్ని శాఖలలోనూ అద్వితీయ పాండిత్యానికీ, అకుంఠిత ప్రఙ్ఞకూ ప్రసిధ్ధి చెంది అనేక సభల్లో అసమాన సన్మానాలను పొంది అఖండకీర్తి నార్జించినవారు పిడపర్తి వంశీయులు యీ ఆంధ్రదేశంలో. అట్టి వంశమందలి ఒక శాఖవారు రామచంద్రపురం తాలూకాలోని సోమేశ్వరం గ్రామంలో నున్నారు. ఆ శాఖకు చెందినవారే పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు. జాతక ప్రశ్న భాగాల్లో అద్వితీయ ప్రతిభాశాలి. అట్టి మహా పండితుడు తపశ్శాలి "నభూతో న భవిష్యతి" అన్న అతిశయోక్తికాదు.
సుమారు నూరు సంవత్సరాలకు పూర్వం ఒకనాటి ఉదయం సుబ్బయ్యశాస్త్రిగారు స్నాన సంధ్యాదనుష్ఠానాలను పూర్తి చేసుకుని వారి యింటి అరుగుపై కూర్చుని వేదాధ్యయనం చేసుకుంటూ యఙ్ఞోపవీతాన్ని వడుకుతున్నారు. రెండవ అరుగు మీద కూర్చున్న వారి ప్రియశిష్యుడు శ్రీధర తాళపత్ర గ్రంథాన్ని చదువుతూ యేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అట్టి సమయంలో ఠాణేదారుగారూ ఆ ఊరి పెద్దలు కొందరూ లోనికి రావడం చూసి శాస్త్రిగారు కలవరంగా లేచి నిల్చున్నారు.
"నమస్కారమండీ శాస్త్రిగారూ! తమరు పెద్దలు, మమ్ములను మీరు గౌరవించడం న్యాయమా? దయచేయండీ" అంటూ ఠాణేదారుగారు శాస్త్రిగారిని కూర్చుండమని వారు కూడా అరుగు మీద కూర్చున్నారు. కూడా వచ్చినవారు రెండరుగులమీద సద్దుకుని కూర్చున్నారు.
శాస్త్రిగారు వారి రాకకు కారణం తెలియక "చిత్తం. తమరు వేంచేసిన కారణం?" అన్నారు నెమ్మదిగా.
"శాస్త్రిగారూ! మహారాజుగారి దగ్గరనుండి వార్తాహరుడు నిన్న వచ్చేడు. ప్రభువులు తమ దర్శనాన్ని కోరుతున్నారు. వారి కోట లోనికి ఒకసారి దయచేయమని మిమ్మల్ని ప్రార్ధించవలసినదిగా మమ్ము ఆదేశించారు. మీకు ప్రయాణానికి ఎప్పుడు అనువుగా ఉంటుందో చెబితే పాలకీ యేర్పాటు చేస్తాను."
శాస్త్రిగారికి అర్ధమయింది. మహారాజావారికి జ్యోతిశ్శాస్త్రంలో చాలా ఆసక్తి కలదని వారు విన్నారు. బహుశా యేదైనా జాతకం చూపడానికిగాని ఆహ్వానించి ఉంటారని అనుకున్నారు. కాని దివానుగారికి మాత్రం యీ శాస్త్రమన్న సగమెరుక. ఆయన యీ శాస్త్రాన్నీ యీ శాస్త్రఙ్ఞుల్నీ కూడా చాలా చిన్నచూపు చూడడమే కాకుండా ముఖస్థంగా కూడా దూషిస్తారని ప్రతీతి. కోటలోనికి పోయి తన విద్యను అక్కడ చూపడం శాస్త్రిగారికి ఇష్టంలేదు. సరస్వతికి తగిన గౌరవం జరగదని ఆయన అనుమానపడ్డారు. అందువలన ఆదినిష్ఠూరమే మేలనే సామెతగా వెళ్ళకుండా ఉండడానికే నిశ్చయించుకున్నారు.
"క్షమించాలి! నేను కోటలోనికి పోవడమేమిటి? మాబోంట్లు దర్బారులో అడుగు పెట్టడానికి తాహతు లేనివారం. మాకెందుకీ రాజసభా ప్రవేశాలు బాబూ! క్షమించవలసిందిగా మహారాజువారికి విన్నవించండి." అన్నారు శాస్త్రిగారు.
"శాస్త్రిగారూ! తమరు పొరబడుతున్నారు. మీరిక్కడ ఉండిపోయినంత మాత్రం చేత మీ పాండిత్యం, ప్రతిభ యిక్కడే ఉండిపోయాయనుకుంటున్నారా? దేశ దేశాలు పాకిపోయేయి. మీ ప్రతిభను విని, మీ విద్వత్తుకు ఆశ్చర్యపడి మీ దర్శనం చేసుకోవాలని ఉన్నట్లు ఆ మధ్య దర్బారులో ఒకసారి అందరి యెదుటా వారి కోరికను వెలిబుచ్చారు మహారాజావారు. ఇప్పుడు ప్రభువులకు మీ వలన సలహా యేదైనా కావలసి ఉండవచ్చు. అది నెరవేర్చడం మన విధికదా శాస్త్రిగారూ." అన్నారు ఠాణేదారుగారు.
"ఏమైనా ప్రభువులకు నా ప్రణతుల నందజేసి క్షమించవలసిందిగా కోరండి. "అన్నారు శాస్త్రిగారు.
ఠాణేదారుగారికి యేమనడానికి తోచలేదు.
"శాస్త్రిగారూ! మీ యీ నిరాకరణకు కారనం మేము తెలుసుకోవచ్చునా?" మృదువుగా ప్రశ్నించేరు.
“సరస్వతీదేవికి తగిన గౌరవం ఆ దర్బారులోజరుగబోదని నాకు తోస్తోంది. అది నేను సహించలేను" అన్నారు శాస్త్రిగారు.
ఠాణేదారుగారికి అర్ధమయింది. దివాన్జీ బిళ్ళగోచీ పండితుల్ని అగౌరవపరచడం తనకు తెలిసిన విషయమే. ఆ రాచఠీవి ఆ దర్పం దివాన్జీ కళ్ళకు పొరలు కప్పేయంటే అసత్యమేమీలేదు. ఆయన దర్శనార్ధమై వచ్చెడి ద్రవ్యాపేక్షగల పండితులనతడు యెట్లు కించపరచినా చెల్లేది. కాని తపస్సంపన్నులూ, శపించగల శక్తిమంతులూ అయిన శాస్త్రిగారిలాంటి పండితులను ఆయన యెరుగడు. శాస్త్రిగారి అనుమానానికి కూడా అవకాశమున్నట్లు తోచింది ఠాణేదారుగారికి. మారు చెప్పలేక కొంత తడవు అవనత శిరస్కుడై
"తమ చిత్తం. ఇం కొకసారి ఆలోచించండి" అంటూ లేచేరు. శాస్త్రిగారూ, పెద్దలూ కూడా లేచేరు.
వారు వెళ్ళిన తరువాత ధైర్యాన్ని చిక్కబట్టి శ్రీధర్ "అయ్యా! రాజాస్ఠానానికి పోవడం మనకు వద్దండి"అన్నాడు.
"ఏమిరా శ్రీధర్, ఎందువలన?"
"అయ్యా, ఆ దివానుగారు చాల చెడ్డవారని వాడుకండి. మొన్న మా మేనమామ అవధాన్లు మీరు యెరిగే ఉంటారు. వేదపఠనంలో అందెవేసిన చెయ్యిలెండి. అతడు ఘన చెబుతుంటే వినవలసిందేనండి. ఆయన దివాన్ గారి దర్శనానికి వెళ్ళేడు, మహారాజా వారి దగ్గర వార్షికం యేర్పాటు చేసుకుందామని. ఇంటివద్ద దివాన్జీని కలుసుకుని ఒక పనస అందుకునేసరికి ఆయన ఉగ్రుడై "ఏమీ ఈ వెధవ గొడవ? అవతలకు పొమ్మను" అని తాబేదారు వైపు తిరిగి అరిచేరుటండి. అల్లా ఉంటుందండి ఆయన ఆహ్వానం."
శాస్త్రిగారికి ముఖం కందగడ్డలా అయింది. విద్యకు ఎంత అపచారం జరిగిందోనని చాలా బాధపడ్డారు.
"శ్రీధర్! పాపం పండాలి నాయనా! అంతవరకూ యింతే" అన్నారు శాస్త్రిగారు.
శ్రీధర్ చదువులో పడ్డాడు.

2

"ఆ బిళ్ళగోచీ పండితునిక్కూడా యెంత అహంభావం ఉందో చూసేరా ప్రభూ!" అన్నారు దివానుగారు మహారాజావారితో.
దివానుగారికి శాస్త్రిగారి సమాధానం అందింది. అది మహారాజావారికి విన్నవిస్తూ యీ విధంగా అన్నారాయన.
"దివాన్జీ! శాస్త్రి గారిని సామాన్య పండితుడనుకుంటూన్నారా! ఆ జైమిని అవతారమే ఆయన"అన్నారు మహారాజావారు.
"సందేహమే లేదు ప్రభూ! ఊరూరా ఆయన ప్రతిభే వినపడుతోంది. జాతకభాగంలోనైతేనేం ప్రశ్నభాగంలోనైతేనేం ఆయన ప్రఙ్ఞ అమోఘం. నిజంగా పూర్వపు మహర్షుల కోవకు చెందిన వారాయన" అన్నారు కవిగారు.
"నాలుగు గీతలు గీయగలిగినవాడల్లా జాతకం చెబుతానని బయల్దేరే యీ రోజుల్లో ఆ విద్యకు తగిన గౌరవం లభించడం చాలా కష్టం"అన్నారు మహారాజావారు.
మహారాజావారికి శాస్త్రిగారియందున్న గౌరవ ప్రపత్తులు అసమానవైనవని గ్రహించేరు దివానుగారు. మౌనంగా కొంతసేపు ఊరుకున్నారు.
"ఆయన విద్యకు తగిన మర్యాద తప్పక లభిస్తుందని వారికి తెలియజేసి సగౌరవంగా వారినిక్కడకు తోడి తేవలసినదిగా ఠాణేదారుకు కబురుచేయండి." అన్నారు మహారాజావారు.
"చిత్తం" అన్నారు దివానుగారు.
కాని ఆయనకు యిష్టంలేదు. ఈ శ్రోత్రియ బ్రాహ్మణునకు యింత గౌరవమివ్వడమా అని ఆయన వ్యథ.
"కాని ప్రభువులకు నాదొక మనవి. శాస్త్రానికి తగిన గౌరవమివ్వదలిస్తే అల్లాంటివారు వేలకువేలు ఉన్నారు. వారందరూ ఆ గౌరవానికి అర్హులేనా ప్రభూ!"
"అదేమిటి దివాన్జీ! సుబ్బయ్యశాస్త్రిగారిని యితర పండితులతో జమ చేస్తున్నారే? పొరపాటు. ఆయన శాస్త్రం తెలిసున్నవారూ పండితులూ కారు. ఆయనే శాస్త్రం. శాస్త్రం యెంత గౌరవానికి అర్హత కలిగి ఉందో అంత గౌరవానికి ఆయన అర్హులు" అన్నారు మహారాజావారు. దివాన్జీకి యిది రుచించలేదు.
"సరే ప్రభూ! అట్లే సందేశం పంపిస్తాను. ఒక్క మనవి నాది అనుగ్రహించండి. ఆయన విద్యనొకసారి పరీక్ష చెయ్యాలనిపిస్తోంది. బంగారాన్ని గీటురాయి మీద రాస్తేనే కదా దాని గొప్పతనం తెలిసేది. అనుమతించండి ప్రభూ!" అన్నారు.
మహారాజావారు నిర్ఘాంతపోయేరు. దివానుగారివైపు కొంచెంసేపు చూసేరు.
కవిగారు కంగారుగా అన్నారు.
"అపచారం ప్రభూ! అటువంటి పనిని తలపెట్టడం కొరివితో తల గోక్కోవడమే"
"ఏమి? అందులో దోషమేముంది? మన పరీక్షకు నిలిస్తే బహుళంగా సత్కరిద్దాం వారిని" అన్నారు దివానుగారు, మహారాజావారు మౌనంగా ఉండడం అనువుగా తీసుకుని.
"దివాన్జీ! నిప్పుతో చెలగాటం పనికిరాదు. మూర్తీభవించిన శాస్త్రమాయన. కొంచెం నిదానంగా మంచి చెడ్డలు ఆలోచించి ముందుకు వెళ్ళండి. " అన్నారు కవిగారు.
"కవిగారి అభిప్రాయమేమో?" అన్నారు దివాన్జీ.
"నా అభిప్రాయం తమరు తలపెట్టిన కార్యం విషాదాంతమవుతుందని"
"ఏమి? పరీక్షకు నిలిచి శాస్త్రిగారు సత్కారాలనందుకోలేరా?" అన్నారు దివాన్జీ హేళనగా.
కవిగారికది సహించరానిదయింది.
"ప్రభువులు క్షమించాలి. సత్కారాల కాశించిన వారైతే శాస్త్రిగారు యెప్పుడో మహారాజావారి సత్కారాల నందుకొని ఉండేవారు. వారికవి అవసరం లేదు. అదిన్నీ గాక శాస్త్రిగారి అనుమానానికి కారణం యిప్పుడు నాకు అర్ధమయింది. మహారాజావారు యువరాజావారి జాతకం చూపించడానికి శాస్త్రిగారిని పిలిపిస్తున్నారు. ఇట్టి సమయంలో వారిని గౌరవంగా ఆహ్వానించి సగౌరవంగా సాగనంపడమే అందరికీ శ్రేయస్కరం. నాకు తోచింది మనవి చేసేను. ఆ తరువాత ప్రభువుల చిత్తం". అని కవిగారు మౌనం వహించారు.
మహారాజావారు ఏమీ అనలేక ఊరుకున్నారు. దివాన్జీ ఈ అవకాశం చూసుకుని
"ప్రభూ! ఆయన మర్యాదలకేమీ లోటు రానివ్వను. ఆస్థానానికి అప్రతిష్ఠ తెచ్చేటంత అవివేకిని కాను. కాని ప్రభువులే శాస్త్రిగారి ప్రతిభను పొగుడుతూ ఉంటే నాకు కూడా వారి పాండిత్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది ప్రభూ! తమరు అనుమతించాలి." అన్నారు.
మహారాజావారికి యెటు చెప్పడానికీ తోచలేదు.
"దివాన్జీ! బాధ్యత అంతా మీదే. అయినా ఆయన్ను పరీక్షించడమంటే యెట్లా చేయదలచుకున్నారో తెలియచేయండి"
"ప్రభువులు క్షమించాలి. ఇంకా నేనేమీ ఆలోచించలేదు. కాని త్వరలోనే విన్నవించుకుంటాను."అన్నారు దివాన్జీ.
కవిగారి కిదేదో విషాదాంతానికి దారితీస్తుందని భయం తోచింది.
"ప్రభువులు సెలవిప్పిస్తే రేపు పునర్దర్శనం చేసుకుంటాను" అన్నారు కవిగారు.
సరేనన్నారు మహారాజావారు. ఒక గంటసేపు మహారాజావారూ, దివానుగారూ మాట్లాడుకున్న తరువాత దివాన్జీవారింటికి వెళ్ళిపోయేరు.

3

మహారాజావారి ఆహ్వానాన్ని రెండవసారి కూడా కాదనలేకపోయేరు శాస్త్రిగారు. ఠాణేదారుగారు తగిన మర్యాదలతో సగౌరవంగా పాలకీపై రాజధానికి తీసుకువెళ్ళేరు శాస్త్రిగారిని. కో్టలోనూ, ఆస్థానంలోనూ కూడా అఖండమైన గౌరవం చూపించారు శాస్త్రిగారికి. దర్బారు ముగిసిన అనంతరం దివాన్జీ శాస్త్రిగారిని కలుసుకుని,
"నమస్కారం శాస్త్రివర్యులకు, మహారాజావారు తమతో ఆంతరంగికంగా మాట్లాడాలని కోరుతున్నారు. తమరు అభ్యంతర మందిరానికి ఒక తూరి దయచెయ్యాలి. " అని సవినయంగా మనవి చేసేరు.
ఈ గౌరవోన్నతికి చాలా ఆశ్చర్యపోయేరు శాస్త్రిగారు. తాను అపోహ పడ్డందుకు చాలా విచారించారు. దివాన్జీతో కలిసి సేవకులు ముందు దారి చూపుతుండగా అభ్యంతర మందిరంలోనికి ప్రవేశించారు. ఆ మందిరంలోని ఉన్నతాసనాలు తీసివేయబడ్డాయి. రత్నకంబళీ పరచబడి ఉన్నది. దానిపై కూర్చుని ఉన్నారు మహారాజావారు. శాస్త్రిగారిని చూచి లేచి నమస్కరించి లోనికి ఆహ్వానించేరు. శాస్త్రిగారు కూడా ఉచితరీతిని ఆశీర్వదించి దివాన్జీతోపాటు రత్నకంబళి మీదనే ఆశీనులయ్యేరు. అర్ధగడియసేపు సంభాషణ ముగ్గురి మధ్య చాలా సరసంగా నడిచిపోయింది. ఆ తరువాత దివాన్జీ మహారాజావారివైపు చూచి వారి ఆఙ్ఞను తెలుసుకుని యీ క్రిందివిధంగా ఉపక్రమించారు.
"శాస్త్రిగారూ! మీరు వేదమూర్తులూ, మూర్తీభవించిన శాస్త్రమేనని మా ప్రభువులు యెప్పుడూ అంటుంటారు. తమ ప్రఙ్ఞ వినడమే కాని తమ దర్శన భాగ్యం నాకెప్పుడూ కలుగలేదు. మహారాజుగారు కూడా మిమ్మల్నెప్పుడూ ముఖతః పరిచయం చేసుకోలేదనుకుంటాను. "
“ దివాన్జీ! తమరు అనర్హుణ్ణి నన్ను చాలా గౌరవిస్తున్నారు. క్షమించమని నా మనవి. తమరు నాకు చూపిన గౌరవానికి అర్హుణ్ణి కాను. నేను అనుమానాన్ని వెలిబుచ్చినందులకు ప్రభువులు నాకు సరిగానే బుధ్ధిచెప్పారు." అన్నారు శాస్త్రిగారు.
"తప్పు తప్పుశాస్త్రిగారూ! మీరల్లా అనకండి. తమ పాండిత్యానికి తగిన గౌరవం మేమివ్వలేకపోయినందులకు యింకా చింతిస్తున్నాం. అదలా ఉంచండి. తమర్ని మహారాజావారు ఒక విషయం తెలుసుకుందుకు పిలిపించేరు."
"సెలవియ్యండి"
దివానుగారు వారి లాంగుకోటు క్రింది జేబులోనుండి ఒక తాళపత్రం తీసేరు. అందుపై ఒక జాతకచక్రం వ్రాసి ఉంది. కావలసిన ఉడుగతులూ, గ్రహప్రవేశాలు అన్నీకూడా అందులో వ్రాసి ఉన్నాయి.
దివానుగారు ఆ జాతక చక్రాన్ని శాస్త్రిగారి చేతికిచ్చి,
"ఈ జాతకుని యోగం భవిష్యత్తులో యెల్లా ఉంటుందో కొంచెం మనవి చెయ్యండి" అన్నారు.
మహారాజావారు చిరునవ్వుతో చూస్తున్నారు.
శాస్త్రిగారు జాతకాన్ని చూసేరు. కళ్ళు పెద్దవి చేసి మళ్ళీ చూసేరు. చాలా ఆశ్చర్యపోయేరు. ముఖంలో అనుమానం ప్రవేశించింది. వెంటనే కోపంగా మారింది. ముఖం కందగడ్డలా అయింది.
మహారాజు యిది చూసి చకితులయ్యారు. కాని దివాన్జీ తన తెలివికి లోలోన మురిసిపోతూ యిదేమీ గమనించలేదు.
"మౌనం వహించేరు సెలవీయండి" అన్నారు.
"చెప్పమన్నారా?" అన్నారు శాస్త్రిగారు. మేఘం ఉరిమినట్లుంది ఆ మాట. దివానుగారు తెల్లబోయారు. జాతకచక్రాన్ని దివానుముందుకు విసిరి యిల్లా అన్నారు శాస్త్రిగారు.
"చెపుతున్నాను. ఈ జాతకునికి గడ్డి తినే యోగమే ఉంది కాని అన్నం తినే యోగంలేదు. తెలుసుకోండి. ప్రభువులు క్షమిస్తే ఒక విషయం చెబుతాను. దివాన్జీ చేసిన ఈ పండిత అవమానం సహించరానిది. శాస్త్రానికి తీరని అపచారం. నా విద్యను పరీక్ష చేయడానికి ఆయనకాదు ఆయన్ను పుట్టించిన బ్రహ్మ దిగిరావాలని తెలుసుకోవలసి ఉంది ప్రభువులు... ఈ జాతకం ఒక కోడెదూడ పుట్టిన సమయానికి గ్రహకూటమిని తెలియచేస్తోంది, మానవశిశువు ఆ గ్రహకూటమి సమయంలో యెన్నడూ జన్మించడు.
ఇంతకూ ప్రభువులు నా విద్యను సగౌరవంగా మన్నిస్తారని హామీ యిచ్చిన మీదటనే తమ దర్శనానికి వచ్చేను. వచ్చినందుకు తగిన గౌరవమే జరిగింది...దివాన్జీ! పండితులతో చెలగాటం పనికిరాదయ్యా నీకు. విద్వాంసులూ పండితులూ అంటే నీ దగ్గరకు ద్రవ్యాపేక్షతో చేరే బ్రాహ్మణులనుకుంటున్నావయ్యా ? మహాపండితుల్నీ శాస్త్రాల్నీ కూలంకషంగా తెలుసుకున్న మహనీయుల్ని నువ్వు ఎరుగవు. వారిని పరీక్షించడానికి నీ తాహతేమయ్యా? నీకూ వారికీ హస్తిమశకాంతరం ఉందని గుర్తుంచుకో. ఇంతకీ నీవు చేసిన అపచారం సహించరానిదయ్యా. మా సరస్వతి దుఃఖపడుతోంది. నా ముఖతః నిన్ను శపిస్తోంది. నీ వంశం నీతోనే సరయ్యా. ముందుకైనా బుధ్ధి కలిగి ఉండు. "
"ప్రభూ! యీ బ్రహ్మణున్ని క్షమించండి. మా సరస్వతి మిమ్మల్ని కూడా దోషిగానే నిర్ణయిస్తోంది. ఇందులో మీ ప్రోత్సాహం లేకపోయినా మహారాజుగా దీనిని వారించకపోయినందుకు మీరు దండనార్హులని ఆమె తీర్పు. యువరాజావారి జాతకం చూపడానికి నన్ను పిలిపించేరు. ఆ పని కాలేదు. ఆ ముహూర్తాన కోడెదూడ జాతకం నా చేతికి వచ్చింది. ప్రభూ......మీ యువరాజావారు జీవించియున్న కాలంలోనే రాజ్యం మాసిపోతుందండి. ఆఖరి రోజుల్లో ప్రభూ! వారు కూడా గడ్డి కరవాలిసిందే.. ఇది సరస్వతి శాపం ప్రభూ! సెలవు ప్రభూ! పునర్దర్శనం వలదండి. సెలవ్" అంటూ నిష్క్రమించారు.
మహారాజావారూ, దివానుగారూ నిస్తబ్దులై అల్లాగే ఉండిపోయేరు.

---------------------------------------------------------------------------------