Pages

Saturday, April 23, 2011

మనం పుస్తకాలు ఎందుకు చదవాలంటే...



నీ ఊహా ప్రపంచంలో
చెయితిరగని కంచంలో
ఎందుకోయ్ పెట్టుకున్నావ్ అన్నం కొంచెం..?
పెట్టుకోవోయ్ పెద్ద బంగారు కంచం
ఒంచుకోవోయ్ పాయసం నిండుగా కంచం...!
(ఇది మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు ఊహాప్రపంచం గురించి వ్రాసుకున్న కవితలో చిన్న భాగం. మన ఊహ మన చిత్తం వచ్చినట్టు ఎంతగా ఎల్లలు దాటి ఊహించుకోవచ్చోనని ఆయన చెప్పిన విషయాన్ని తెలియచెప్పడానికి ఇది ఇక్కడ పెట్టాను.)

మనం పుస్తకాలు ఎందుకు చదవాలంటే...
మనిషికి ఊహలో ఊహించుకున్నంత ఆనందం నిజజీవితంలో కనిపించదు.
నిజం కంటే ఊహ అందంగా వుంటుంది కనకే మనిషి తను చెయ్యలేని పనినీ, తన కళ్ళకు కనిపించలేని అందాల్నీ ఊహలో వెతుక్కుంటాడు.
ఒక సినిమా చూస్తున్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ కథలోని పాత్రలు కళ్ళముందు కనపడతాయి. అవి నిర్మాతా, దర్శకుల దృష్టిలో సృష్టించుకున్న పాత్రలు, సంఘటనలు. వాటిని వారి దృష్టితోనే మనమూ చూస్తున్నాం. ఒక్కరి అభిరుచి అవి చూస్తున్నవారందరిమీదా రుద్దబడుతోంది.
అదే మనం ఒక పుస్తకం చదువుకుంటుంటే జరిగే పరిస్థితి వేరు. పుస్తకంలో కవిగాని, రచయితగాని రాసినదానిని చదువుతున్నప్పుడు మనం దానిని మన అభిరుచికి అనుగుణంగా ఆ సుందరదృశ్యవర్ణనను కానీ, ఆ పాత్ర మనసులోని భావాలనుగానీ, ఆ పాత్ర ప్రవర్తించిన తీరునిగానీ, ఆ పాత్రయొక్క అందం, ఆహార్యంగానీ ఊహించుకుంటాం. అది మన మనసుకి చాలా ఆనందం కలగజేస్తుంది. అందుకే పుస్తకపఠనంలో అంత ఆనందం వుంది.
ఒక మంచి పుస్తకం చదువుతున్నప్పుడు మనం అందులో లీనమైపోతాం. ఆ పుస్తకంలోని కథతో పాటుగా ప్రయాణం చేస్తాం. కథ సుఖాంతమైతే ఆనందిస్తాం. దుఃఖాంతమైతే బాధపడతాం. మన మనసుల్ని ఇంతగా ప్రభావితం చేస్తున్న పుస్తకపఠనాన్ని మనకు సాధ్యమైనంతవరకు ప్రోత్సహిద్దాం. మన పిల్లలకి పుస్తకాలు చదవడం అలవాటు చేద్దాం. ఎంతో గొప్ప కవులని, రచయితలని వాళ్ళకి పరిచయం చేద్దాం. పుస్తకపఠనంలోని ఆనందాన్ని వాళ్ళకీ రుచి చూపిద్దాం.
ఏప్రిల్ 23 జాతీయ పుస్తకదినం సందర్భంగా...
(చిత్రం...గూగులమ్మ సౌజన్యంతో...)

14 వ్యాఖ్యలు:

Lakshmi Raghava said...

నిజంగా చదివేటప్పుడు ఎంత ఉహించుకుంటా మో నాకూ అనుభవం!!మీరు చెప్పింది నిజం..శ్రిలలితగారు

vasantam said...

హృదయానికి హత్తుకునేట్లు చక్కగా చెప్పారు :) వసంతం వాసు

Pavan said...

meeru cheppindi konta varaku correct , kani mottam kaadu..

cinema cheseppudu characters anevi, director thoughts thaggattuga mould cheyabadathayi, correct kaani chusevallu andaru alaage perceive chestaarani ledu..

audience perceive chesedi , valla knowlede,maturity an understanding meeda depend avuthundi..
andaru okalaage visualize cheste, cinema kondarikibaga nachhi , inka kondariki assalu nachaka povadam vundadu..

మురళి said...

Nice post...

శ్రీలలిత said...

లక్ష్మీరాఘవగారూ,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

వసంతంగారూ,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

పవన్ గారూ,
మీరు చెప్పింది అక్షరాలా నిజమండీ.. నా ఉద్దేశం ఏమిటంటే ఒక సినిమా చూసినప్పుడు అది ఆ దర్శక, నిర్మాతల అభిరుచులను ప్రతిబింబించడానికి అవకాశం వుందని. మీరు అన్నట్టుగానే అటువంటి అభిరుచులు వున్నవాళ్ళకి ఆ సినిమాలు నచ్చుతాయి, లేనివారికి నచ్చవు.
అందుకనే నేను అన్నదేమంటే ఒక పుస్తకం కనక చదివితే, దానిని ఊహల్లో మనం మనకి ఇష్టమైన రీతిలో చిత్రీకరించుకోవచ్చునని. అలా చెయ్యడం వలన మనకి చాలా ఆనందం కలుగుతుంది. నేను చెప్పదలచుకున్నది అదే. ఒకవేళ పూర్తిగా చెప్పలేకపోయానేమో...

శ్రీలలిత said...

MuraligaarU,
Thank you...

మాలా కుమార్ said...

చదువు ప్రాముఖ్యం గురించి బాగా రాసారండి .

Unknown said...

baagundandi.

మరువం ఉష said...

ఎన్నటికీ మనల్ని వీడని స్థిరమైన మైత్రి సాహిత్యం. అదే శాశ్వతానందం మృత్యువు దాకా. మంచి సాహిత్యాన్ని గుర్తించి ఆ అనుభవం/అనుభూతి మిగుల్చుకోవాలంటే ఒక మార్గం పఠనం. పుస్తకాలు ప్రపంచ చైతన్యాన్ని మోసుకొస్తాయి. మనలో భావ ఊపురులని నింపుతాయి. మీ నాన్న గారిని గూర్చి మరి కాస్స్త చెప్పండి- లేదా శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన పిడపర్తివారు---కథలూ-గాథలూ అనే పుస్తకం పరిచయం చెయ్యండి.

శ్రీలలిత said...

మాలాకుమర్ గారు,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

రాధికగారు,
ధన్యవాదాలండి...

శ్రీలలిత said...

ఉషా,
మీ స్పందనకు ధన్యవాదాలు. మీ భావప్రకటన అద్భుతం.
పుస్తక పఠనం గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. కాని ఒక పుస్తకం చదువుతున్నప్పుడు దానిలోని మరో మారుమూల కోణమైన ఊహలో మనం సృష్టించుకునే ఆ సన్నివేశాలలోని అందం ఎవరి అనుభూతి వారిదే అనే అభిప్రాయం తెలుపుదామనే ఈ నాలుగు మాటలూ చెప్పాను. బహుశా నేను ఇంకా స్పష్టంగా చెప్పాలేమో...
ఉషా, మీరు అన్నట్టుగానే మా నాన్నగారి గురించి కొన్ని విషయాలైనా నలుగురితో పంచుకోవాలని వుంది. ఏమో చేయగలనో లేదో...
భావాలన్నీ మనసులో గింగిరాలు తిరుగుతుంటే
అల్లిబిల్లిగా అల్లుకున్న ఆ చిక్కుముడిని విప్పి
ప్రతి కుసుమంలోని ప్రత్యేక సౌరభాన్ని ప్రస్ఫుటించేలా
మనసును కదిలించే జలతారు దారాల
మనోహరంగా అల్లిన అందాల కదంబమాలను
ఆ శ్రీవాణీ చరణ సన్నిధికి అందిద్దామని అత్యాశ...
ఏమొ... చేయగలనేమో..
ఆ శ్రీరామచంద్రుని దయవల్ల
శారదామాత అనుగ్రహిస్తే
చేయగలనేమో......