Pages

Tuesday, December 27, 2011

మంచినీరు...

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన "పిడపర్తివారు-కథలూ-గాథలూ" పుస్తకం లోని మరో కథ.
పిడపర్తివారి వాక్శుధ్ధికి తార్కాణంగా నిలిచే కథ ఇది...

మంచినీరు...


నూట యాభై సంవత్సరాల క్రితం మాట.

తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణానికి చేరువలో నున్న సోమేశ్వరం గ్రామంలో వంశ పరంపరాగత జ్యోతిర్విద్యా సంపన్నులు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు నివసిస్తూండేవారు. వారి ప్రతిభ దేశ దేశాల వ్యాపించి అనేక కథల రూపంలో యింకనూ అక్కడక్కడ నిలిచిపోయింది. వారి ప్రతిభ కొక మచ్చు తునక ఈ క్రింది గాథ.

కానూరు గ్రామానికి సమీపంలో కానూరు అగ్రహారం అనే బ్రాహ్మణ అగ్రహార మొకటి యిప్పటికీ ఉన్నది. అందు సంపన్న బ్రాహ్మణ గృహాలు ఆ రోజుల్లో నూరూ నూటయాభైదాకా ఉండేవి. ఆ అగ్రహారం గోదావరి గట్టుకు చేరి ఉన్నప్పటికీవారు ఎక్కడ నూయి తవ్వినా ఉప్పునీరే పడేది కాని మంచినీరు పడేది కాదు.

ఒకానొక సమయంలో బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు ఏదో పనిమీద సమీప గ్రామానికి వచ్చి ఆ ఊరు మీదుగా తిరిగి వెడుతున్నారు. ఆ సమయంలో ఊరు పెద్దలందరకూ ఒక ఊహ కలిగింది. పదిమంది పెద్దలూ కలిసి వెంటనే శాస్త్రిగారిని కలుసుకోవాలని వెంబడించేరు.

ఆయన ఊరు చివరకు చేరుకునేసరికి ఆయన్ను కలుసుకుని "నమస్కారమండీ " అని పలుకరించేరు.

వెంటనే శాస్త్రిగారు నిలబడిపోయి " ఏమిటి? అగ్రహారంలోని పెద్దలంతా యిలా దయచేసేరు?" అని అడిగేరు. వారిలోని పెద్దవారొకాయన యీ విధంగా శాస్త్రిగారికి మనవి చేసేరు.

"శాస్త్రిగారూ! ఈ ఊరిలో మేము ఎక్కడ నూయి తవ్వినప్పటికీ ఉప్పునీరే కాని మంచినీరు పడటం లేదు. గోదావరికి సమీపంలో నున్నప్పటికీ మంచినీరు పడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజూ యీ గ్రామంలోని స్త్రీలు గోదావరినదికి పోయి మంచినీరు తెచ్చుకోవడానికి చాలా శ్రమ పడుతున్నారు. అందులోనూ వేసవికాలంలో యిసుక తిప్పలలో నడచి నదిలో నీరు తెచ్చుకోవలసి వస్తోంది. యి పరిస్థితుల వలన మేము మంచినీటికై చాలా కష్టపడుతున్నాము. మాకు మీరే భగవత్తుల్యులు. మేము ఎక్కడ నూయి తవ్వుకుంటే మంచినీరు పడుతుందో సెలవిస్తే అక్కడ తవ్వుకుంటాం. దయచేసి మా కోరిక మన్నించండి. " అన్నారు.

శాస్త్రిగారు ఒక ముహూర్తకాలం ఆలోచించారు.
తాను నిల్చున్న స్థలాన్ని తన కుడిచేతి తర్జనితో చూపి " ఇక్కడ త్రవ్వండి. భగవత్కృప కలుగుతుంది." అని చెప్పి పెద్దలవద్ద సెలవు తీసుకుని వారి మార్గాన వారు వెళ్ళేరు.
అక్కడ గుర్తు పెట్టుకుని నూయి తవ్వించేరు ఆ ఊరివారు. పరిశుభ్రమైన నీరు పడింది. ఆ ఊరి ప్రజల కష్టం తొలగిపోయింది.
ఇప్పటికి కూడా ఆ నూయి ఒక్కటే మంచినీటి నూయి ఆ అగ్రహారానికి.


---------------------------------------------------------------------------------------------

6 వ్యాఖ్యలు:

Disp Name said...

ఈ వాక్శుద్ధి గురించి చాలా చోట్ల విని వున్నానండీ. ఒక దశ తరువాత ఇట్లాంటి మహానుభావులు ఏది చెప్పిన అదే జరుగును అన్నట్లు అవుతాయట. వారికి తెలియకుండానే కొన్ని సార్లు వారు ఏది చెబుతారో అదే జరుగుతుందని విన్నాను.

Anonymous said...

మంచి మాట విన్నా.

శ్రీలలిత said...

Zilebi,
మీరు విన్నది నిజమేనండీ...

శ్రీలలిత said...

kastephale,
ధన్యవాదాలండీ...

Anil Piduri said...

మీ నాన్నగారి జీవితములోని అద్భుత సంఘటనను చెప్పారు. చదువరులకు మీరు - అందించిన నిజంగా అమూల్య విశేషం ఇది, శ్రీ లలితగారూ
వాక్శుద్ధి: అనే మాట ప్రపంచం లో - విభిన్నమైన ఉన్నత సంస్కృతి కలిగిఉన్న- ప్రత్యేకత కలిగిఉన్న- కేవలం మన దేశంలో మాత్రమే అనేక యుగాలనుండీ ఋజువు ఔతూనే ఉన్నది.
ఈ శీర్షిక తోనే ఎన్నో వ్యాసాలు, వివరణలూ పాఠకులకు అవసరమౌతూనే ఉంటాయి.
(konamaanini)

శ్రీలలిత said...


Anil Piduri garu,
మీకు ఈ విశేషం నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా వుందండీ..
మీ బ్లాగులో చాలా మంచి సమాచారాన్ని అందిస్తున్నారు. చాలా బాగుంది.