Pages

Monday, July 25, 2011

దొరగారి ప్రశ్న.

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన "పిడపర్తివారు-కథలూ-గాథలూ" పుస్తకం లోని మరో కథ.
మా చిన్నప్పుడు ఈ కథని మా నాన్నగారు ఎంతో నాటకీయంగా చెపుతుంటే చెవులు దోరగిలబెట్టి వినేవాళ్లం.





విజయనగర ప్రభువులు విజయరామ గజపతులు పద్మనాభం దగ్గర జరిగిన యుధ్ధంలో మరణించిన అనంతరం అప్పటికి పదహారు సంవత్సరముల వయస్సులో నున్న వారి కుమారులు నారాయణ గజపతులు అడవులలోనికి పారిపోయారనీ, కొంతకాలానికి విజయనగరానికి తిరిగివచ్చి బ్రిటిష్ వారికి అపరాధ రుసుము చెల్లించగా వారు విజయనగర సంస్థానాన్ని నారాయణ గజపతులకు అప్పగించేరనీ తెలుస్తోంది. మరల రాజ్యం లభించిన కారణంగా శ్రీ నారాయణ గజపతులు వారి ఆప్తులకూ, తనకు కష్టసమయంలో సాయపడినవారికీ యీనాములిచ్చి కృతఙ్ఞతలను తెలుపుకున్నారు.

శ్రీ నారాయణ గజపతులే పిడపర్తి సీతారామశాస్త్రిగారికి వారి ప్రఙ్ఞకు మెచ్చి కొన్ని యీనాం భూములను యిచ్చేరు. ఆ యీనాం భూములకు బదులు క్రీ.శ. 1811 వ సంవత్సరములో బూరాడపేట అనే లక్ష్మీనారాయణపురం అగ్రహారాన్ని వారికి బహూకరించేరు.

క్రీ.శ. 1822 వ సంవత్సరం నాటికి అప్పటి మహారాజావారు శ్రీ శాస్త్రిగారి వారసులపై ఆ అగ్రహారం స్వాధీనం నిమిత్తం విశాఖపట్టణం సబ్ కోర్ట్ లో దావా వేసేరు. సబార్డినేట్ జడ్జి శ్రీ ఏ.ఎల్.వి.రమణగారు ఆ దావాలో మహారాజావారికి అనుకూలంగా తీర్పు నిచ్చేరు. ఆ తీర్పుపై శ్రీ శాస్త్రిగారి వారసులూ తదితరులూ మద్రాసు హై కోర్టులో అప్పీలు దాఖలు చేసేరు. ఆ అప్పీలు విచారణ సమయంలో జరిగిందని ప్రచారములోనున్న యీ క్రింది గాధను చిత్తగించండి. ఆ అప్పీలు మద్రాసు హైకోర్టులో విచారణకు చీఫ్ జస్టిస్ టర్నరు దొరగారున్నూ, జస్టిసు ముత్తుస్వామి అయ్యరుగారున్నూన్యాయపీఠం మీద కూర్చుని ఉన్నారు. శ్రీ శాస్త్రిగారి తరఫున వారి పాండిత్యముచే వాదిస్తున్న వకీలుగారు యీ క్రింది విధంగా వారికి మనవి చేసేరు.

"ప్రభువులు చిత్తగించాలి. అప్పీలుదారులు పిడపర్తి వంశానికి చెందినవారు. వారి వంశం కొన్ని శతాబ్దాలనుండి కూడా జ్యోతిశ్శాస్త్ర పాండిత్యానికి ప్రసిధ్ధి జెంది ఉన్నది. ఆ వంశమునందు జన్మించిన శ్రీ సీతారామశాస్త్రిగారు వంశ పరంపరాగత జ్యోతిర్విద్యాసంపన్నులు. వారి పాండిత్యముచే శ్రీ నారాయణ గజపతులను మెప్పించిన కారణంగా మహారాజులు వారికి కొన్ని భూములను యీనాములుగా యిచ్చి క్రీ.శ. 1802 పెర్మినెంటు సెటిల్మెంటు అనంతరం ఆ యీనాం భూములకు బదులుగా బూరాడపేట అనే లక్ష్మీనారాయణ పురం అగ్రహారాన్ని వారికి క్రీ.శ. 1811 వ సంవత్సరంలో వంశపారంపర్యంగా అనుభవించడానికి కొంత కట్టుబడిపై దఖలు పరచియున్నారు.”

టర్నరు దొరగారు ఆశ్చర్యం ప్రకటిస్తూ యిల్లా అన్నారు.
"మీ దేశంలో ప్రభువులు గ్రామాలకు గ్రామాలే బహుమానాలుగా యిచ్చేస్తుంటారా ?"

వకీలుగారు:- చిత్తం. మా ప్రభువులు యెప్పుడూ చాలా దానగుణం కలవారే ప్రభూ!
టర్నరు:- అయినా యీ రీతిగా గ్రామాలకు గ్రామాలే యిచ్చేస్తుంటే కొంతకాలానికి ప్రభువుల రాజ్యపరిమితి కూడా తగ్గిపోతుందేమో?
వకీలు:- గ్రామాలను కొంత కట్టుబడిపై యిస్తూ అనుభవించడానికి మాత్రమే యిస్తారు. రాజ్యానికే లోటూ జరగదు. అయినా యిల్లా బహుమతి పొందే అర్హత ఉన్నవారు చాలా తక్కువగా ఉంటారుకదా!
టర్నరు:- అదీ నిజమే ననుకోండి. గ్రామాలు బహుమానంగా పొందే అర్హత అప్పీలుదారులకు ఉన్నదా?
వకీలు:- సందేహంలేదు ప్రభూ! ప్రభువులు నారాయణ గజపతులు రామచంద్రపురం వెళ్ళినప్పుడు శ్రీ సీతారామశాస్త్రిగారి పాండిత్యాన్ని చూచినవారై వారికి కొంత భూమిని యీనాంగా యిచ్చి విజయనగరం రప్పించుకున్నారు.
టర్నరు:- నేను కూడా మా దేశంలో వింటూ ఉండేవాడిని జ్యోతిశ్శాస్త్రంలో పండితులు యీ దేశంలో శతసహస్రాలుగా ఉన్నారని. కాని నాకు యింతవరకూ అల్లాంటివారిని కలుసుకునే అవకాశం కలగలేదు.
వకీలు:- చిత్తం. పిడపర్తి వారి వంశమంటేనే జ్యోతిశ్శాస్త్రం ప్రభూ! ఆ వంశంలో పుట్టిన ప్రతి వ్యక్తీ కూడా ఆ శాస్త్రంలో నిష్ణాతులే.
టర్నరు:- చాలా ఆశ్చర్యకరమైన విషయమే. వారెవరైనా యిప్పుడిక్కడ ఉన్నరా?

వెంటనే వకీలుగారు కోర్టుహాలులో నున్న శ్రీ పిడపర్తి దక్షిణామూర్తి శాస్త్రిగారిని రమ్మని పిలిచి జడ్జిగారివైపు తిరిగి యిల్లా అన్నారు.

వకీలు:- ప్రభువులు చూడదలచుకుంటే అప్పీలుదారులు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారు యిక్కడే ఉన్నారు.
టర్నరు:- వారికి గౌరవ పూర్వక ప్రణతుల నందజేయండి. ఈ అప్పీలుకు సంబంధం లేకపోయినా నా ఆసక్తిని తెలియపరుస్తున్నాను. వారికి అభ్యంతరం లేకపోతే వారి పాండిత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని నాకు యివ్వగలరా?

వకీలుగారు శ్రీ శాస్త్రిగారిని సంప్రదించి వారి అంగీకారాన్ని జడ్జిగారికి తెలియపరిచేరు. టర్నరు దొరగారు జడ్జి ముత్తుస్వామి అయ్యరు గారితో పదినిమిషాలుపాటు మాట్లాడి వకీలుగారివైపు తిరిగి యిల్లా అన్నారు.

టర్నరు:- శ్రీ ముత్తుస్వామి అయ్యరుగారిని సంప్రదించినాను. జ్యోతిశ్శాస్త్రం మూడు విభాగాలుగా యీ దేశంలో ప్రసిధ్ధిజెంది ఉన్నదని తెలుసుకున్నాను. అందులో సిధ్ధాంతభాగంలోనూ జాతకభాగంలోనూ వారి పాండిత్యాన్ని తెలుసుకునే అవకాశం ప్రస్తుతం లేకపోవడం వలన ప్రశ్న భాగం లోనే వారి పాండిత్యాన్ని తెలుసుకోదలుచుకున్నాను. వారికేమైనా అభ్యంతరమున్నదా?

వకీలుగారు యీ విషయం శ్రీ శాస్త్రిగారికి తెలియపరచి వరికి అభ్యంతరం లేదన్న విషయాన్ని టర్నరు దొరగారికి తెలియజేసేరు. అంతట టర్నరు దొరగారు వకీలుగారితో యిల్లా అన్నారు.

టర్నరు:- రేపు ఉదయం నేను యీ కోర్టు హాలులోనికి ఏ మార్గం గుండా ప్రవేశిస్తానో చెప్పగలరా?

వకీలుగారు శ్రీ శాస్త్రిగారికి దొరగారు చెప్పినది తెలుగులో చెప్పేరు. శ్రీశాస్త్రిగారు ప్రశ్న సమయానికి గ్రహ స్థితులను పరిశీలించి అయిదు నిముషాల అనంతరం వకీలుగారి నడిగి కాగితం తీసుకుని ఆ కాగితంపై యేదో వ్రాసి మడతపెట్టి వకీలుగారికిస్తూ యీ కాగితం దొరగారికీయవలసిందిగానూ, మర్నాడు కోర్టుహాలులో ప్రవేశించిన అనంతరం యీ కాగితం చూసుకోవలసిందిగా మనవి చేయమని కోరేరు. వకీలుగారు ఆ కాగితం దొరగారికిచ్చి శ్రీశాస్త్రిగారు చెప్పిన రీతిగానే మనవి చేసేరు. దొరగారు సంతోషించి ఆ కాగితాన్ని వారి ఆఫీసు బాక్స్ లో పెట్టుకున్నారు. ఆ పైన ఆప్పీలులో వకీలుగారు చెప్పే విషయాలను వినడానికి ఉపక్రమించేరు.

మరునాడు కోర్టుహాలుకు వచ్చిన వకీళ్ళు, ప్రజలు ఆ హాలుకు తూర్పునున్న రెండుద్వారములకు మధ్యగా నున్న గోడ బ్రద్దలు కొట్టబడి మార్గం ఏర్పాటు చేయబడి ఉండడం గమనించేరు. కాని అది ఎందుకు అల్లా చేయబడిందో వారి ఊహకు అందలేదు. అందరూ హాలులో కూర్చున్నారు. ముత్తుస్వామి అయ్యరు వారి చాంబర్ నుండి వచ్చి న్యాయపీఠంపై ఆసీనులయ్యేరు. అందరూ టర్నరుదొరగారి రాకకోసం చాంబర్ కున్న ద్వారం వైపు చూస్తున్నారు. అంతలో టర్నరు దొరగారు తూర్పువైపు గోడకు బలవంతంగా పడగొట్టించి నూతనంగా ఏర్పరచిన మార్గం గుండా కోర్టుహాలులోనికి వచ్చి అందరూ ఆశ్చర్యంగా చూస్తూండగా న్యాయపీఠం మీద ఆసీనులయ్యారు. హాలులోనికి వచ్చిన వారందరూ కూర్చున్న మీదట దొరగారు వారి నుద్దేశించి యీ క్రింది విధంగా అన్నారు.

"నేను కోర్టుహాలులోనికి యీ క్రొత్తమార్గం గుండా ప్రవేశించడం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. దానికి కారణం చెబుతాను. నిన్న యీ కోర్టులో జరిగిన విషయాలు మీ అందరికీ తెలిసే ఉన్నాయి. నేనీ రోజు ఏ మార్గం గుండా యీ హాలులోనికి ప్రవేశిస్తానో తెలియపరచవలసిందిగా శ్రీ శాస్త్రిగారిని కోరేను. వారొక కాగితం మీద సమాధానం వ్రాసి యిచ్చి యీ రోజు న్యాయపీఠం మీద కూర్చున్నాక చూసుకోవలసిందిగా చెప్పేరు. నేను ఏ మార్గం ద్వారా లోపలికి వచ్చేనో మీరందరూ చూసే ఉన్నారు. శ్రీ శాస్త్రిగారు నా ప్రశ్నకేమి సమాధానం యిచ్చి ఉన్నారో చూద్దాం" అని వారి ఆఫీసుబాక్సునుండి కాగితం తిసి శ్రీ ముత్తుస్వామి అయ్యరుగారికిచ్చి చదవవలసిందిగా కోరేరు. శ్రీ అయ్యరుగారు యీ క్రిందివిధంగా చదివేరు.

"దొరగారు రేపు కోర్టుహాలులోనికి ఏ మార్గం గుండా ప్రవేశిస్తారో తెలుపవలసిందిగా సెలవిచ్చేరు. రేపు తూర్పువైపునున్న రెండు ద్వారాలకు మధ్యలో నున్న గోడలో బలప్రయోగం ద్వారా ఏర్పరచిన మార్గం గుండా కోర్టుహాలులోనికి ప్రవేశిస్తారనే విషయం ప్రశ్నకాలానికున్న గ్రహస్థితుల వలన విశదమౌతోందని నా మనవి."

ఇది విన్న కోర్టుహాలులోని జనమంతా నిర్ఘాంతపోయేరు. దీని తర్జుమా దొరగారికి శ్రీ అయ్యరుగారు వినిపించగానే దొరగారు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేరు.

శ్రీ శాస్త్రిగారి జ్యోతిశ్శాస్త్ర పాండిత్యానికి అక్కడునున్న జనులందరూ జోహారులర్పించేరు.



------------------------------------------------------------------------

3 వ్యాఖ్యలు:

జయ said...

I wish you a very Happy Friendship Day.

శ్రీలలిత said...

Thank you Jayaa..
I too wish you a very Happy Friendship Day..

సుభద్ర said...

wow lalita gaaru good one..