Pages

Tuesday, August 4, 2009

ఆశ్రేష కి అత్తగారుండరా?

ఆశ్రేషకి అత్తగారుండరు... మఖకి మామగారుండరు.. విశాఖ విసిరి కొడుతుంది.. వంటి మూఢ నమ్మకాలు మనలో చాలా మందికి వున్నాయి. ముఖ్యంగా పెళ్ళిసంబంధాలు చూసెటప్పుడు ఈ విషయాన్ని మరీ పెద్దది చెసి చూపిస్తారు. మనిషికి నమ్మకాలుండడంలో తప్పులేదు. అది మన మనుగడకు అవసరమే.కాని ఇలాంటి మూఢ నమ్మకాలవల్ల మనలో చాలా మంది అన్నివిధాలుగా అనుకూలంగా వున్న సంబంధాలని కూడా కేవలం ఈ ఒక్క కారణం తో వదులుకుంటున్నారు. శాస్త్రం గొప్పదే. అనుసరించదగ్గదె. కాని ఆశ్రేష నక్షత్రజాతకులు లక్షల్లొ వుంటారు. అందరికీ ఒక్కటే సూత్రం వర్తించదు. ఒకే నక్షత్రంలొ పుట్టిన లక్షలాది జాతకుల జీవితాలు ఒక్కలాగే నడవవు. ఎందుకని? ఎవరి వ్యక్తిగత జాతకాన్ని బట్టి వారి జీవితం నడుస్తుంది. నాకు తెలిసి మా బంధుమిత్రుల్లో ఆశ్రేష నక్షత్రం కలవాళ్ళు ఆరుగురు వున్నారు. వారి పెళ్ళయి ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ అత్తగార్లు నిక్షేపంగా వున్నారు.

దీని గురించి జ్యోతిశ్శాస్త్ర పండితులు విపులంగా చెప్పారు. శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన పిడపర్తివారు---కథలూ-గాథలూ అనే పుస్తకంలో దీని గురించి ఒక కథ వుంది. దానిని యధాతధంగా ఇక్కడ వ్రాస్తున్నాను..


ఆశ్రేష జన్మ నక్షత్రం
వధువు జన్మ నక్షత్రం ఆశ్రేష కనుక అయినట్లైతే అత్తగారి గండం వుంటుందనే మూఢనమ్మకం చాలా ప్రచారంలొ వుంది. అందువల్ల ఆశ్రేష నక్షత్రంలో జన్మించిన ఆడపిల్లకు పెండ్లిసంబంధం కుదర్చడం తల్లిదండ్రులకు చాలా కష్టమౌతోంది.ఈ రోజుల్లొ కేవలం జన్మనక్షత్రం ఆశ్రేష అయినంతమాత్రం చేతనే ఈ కీడు కలుగుతుందనే నమ్మకం తప్పు అని ఈ క్రింద గాధ రుజువు చేస్తుంది.

కీ//శే// పిడపర్తి పెదపూర్ణయ్య సిధ్ధాంతిగారు రామచంద్రపురం తాలూకాలోని పులుగుర్త గ్రామంలొ కాపురముండేవారు. ఆ తాలూకా లొనే మరో గ్రామంలో భాగ్యవంతులయిన కమ్మవారు వివాహ సంబంధం నిశ్చయించుకుని ఇంక ముహూర్తం పెట్టించుకోవడానికై ఆవూరిలోని సిధ్ధాంతిగారిని సంప్రదించడానికి వెళ్ళేరు. సిధ్ధాంతిగారు వధూవరుల జన్మ నక్షత్రాలు అడిగినప్పుడు తెలిసింది వధువు నక్షత్రం ఆశ్రేష అని. వెంటనే వరుని తండ్రి ఆ వధువును తన కుమారునికి చేసుకోవడానికి నిరాకరించెడు.కేవలం ఆశ్రేష నక్షత్రంలొ వధువు జన్మించినందువల్ల అత్తగారికి కీదు కలుగుతుందనే నమ్మకమే ఆయన నిరాకరణకు కారణం. అన్నీ నిశ్చయించుకుని ఆఖరిక్షణంలొ వచ్చిన ఈ ఆటంకానికి వధూవరుల తండ్రులూ, ఆవూరి పెద్దలూ చాలా విచారించెరు. కాని వరుని తండ్రి మాత్రం తన పట్టు విడువలేదు. ఔరి పెద్దలు ఒక రాజీ ప్రయత్నం చెసేరు.శ్రీ పెదపూర్ణయ్య సిధ్ధాంతిగారి అభిప్రాయమ్ తెలుసుకొవాలనీ ఆయన ధర్మశాస్త్రంలొ నిష్ణాతులు కనుక ఆయన దోషం లేదంటే తాను అంగీకరిస్తాననీ వరుని తండ్రి అన్నారు.

అందుకై వధూవరుల తండ్రులిద్దరూ కలిసి బయల్దేరి ఒకనాడు ఉదయం పులుగుర్త గ్రామం వచ్చేరు. అప్పటికి శ్రీ పెదపూర్ణయ్య సిధ్ధాంతిగారు ఊరిముందునున్న కాలువలో స్నానం చేస్తున్నారు. స్నానానంతరం వారు వచ్చిన కారణమేమిటని ప్రశ్నించేరు. వధువు తండ్రి విషయం వివరిస్తూ కేవలం ఆశ్రేష నక్షత్రమందు వధువు పుట్టిన కారణం వల్లనే వరుని తండ్రి ఈ సంబంధం నిరాకరిస్తున్నారనీ, సిధ్ధాంతిగారి అభిప్రాయం సెలవిమ్మని నెమ్మదిగా మనవి చేసేరు. సిధ్ధాంతిగారు చిరునవ్వుతో "నాతో రండ" ని వారిని తమ ఇంటికి తీసుకొని వెళ్ళేరు. వారి ఇంటిముందున్న తాటాకుల చాపమీద వచ్చినవారిని కూర్చోమని రెండవ అరుగుపై వారు కూర్చుని "బుచ్చమ్మా" అని పిలిచేరు. ఆయన కోడలు లోపలినుండి సావిడి లోనికి వచ్చింది. "నీ జన్మనక్షత్రమేమిటి?" అని ఆమె నడిగేరు. "ఆశ్రేష" అని ఆమె సమాధానం చెప్పింది. "నువ్వు లోపలికి వెళ్ళి మీ అత్తగారినిలా రమ్మను" అన్నారు. అయిదు నిమిషాలలో పచ్చటి దబ్బపండు వంటి మేనిఛాయతో, తెల్లటికొప్పుతో, నుదుట రూపాయినాణెమంత కుంకుమబొట్టుతో వారి ఇల్లాలు మహాలక్ష్మమ్మగారు సావిడిలొకి వచ్చేరు. "బుచ్చమ్మ నీకేమౌతుంది?" అని ఆమెనడిగెరు. "కోడలు" అని ఆవిడ సమాధానం విని, "సరే..పనిలోవు వున్నావేమో..చూసుకో "అనగానే ఆవిడ లొపలికి వెళ్ళేరు. వచ్చిన పెద్దమనుష్యులిద్దరూ తెల్లబోయి చూస్తున్నారు.

"చూసేరా.ఇప్పుడు వచ్చినావిడకు మొదట వచ్చినావిడ కోడలవుతుంది.ఆవిడ జన్మనక్షత్రం ఆశ్రేష అని చెప్పడం విన్నారుకదా..ఇరవై సంవత్సరాలయింది మా అబ్బాయి వివాహమయి.చూడండి అత్తగారు రాయిలా వుంది. దీని కేమంటారు?"

వెంటనే ఆ వచ్చినవారు సిధ్ధాంతిగారి పాదాలకు నమస్కరించి "మా సందేహం తీరిపోయిందండీ..సెలవు తీసుకుంటాం." అని లేచేరు.

" అందువలన అనవసరంగా మూఢనమ్మకాలతో వివాహసంబంధాలు పాడుచేసుకోకండి. మనస్సులో ఏవిధమైన శంకలూ, భయాలూ వద్దు. జన్మనక్షత్ర మొక్కటేనా జాతకాలనూ, జీవితాలనూ తారుమారు చేసేది? దోషంలేని చోట కూడా మూర్ఖమైన పట్టుదల వద్దు. శాస్త్రంలో నిషేధం లేనప్పుడు ఈ శంకలనవసరం. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. శుభం కలుగుతుంది." అన్నారు సిధ్ధాంతిగారు.

------------------------------------------------------------------